తిరుపతిలో సిఐడి డిఎస్పీ అనుమానాస్పద మృతి
స్వర్ణ రెసిడెన్సీ నుంచి దూకిన శ్రీధర్ ఆస్పత్రికి తరలించేలోగానే మరణించాడు. గత ఐదేళ్లుగా అతను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. భార్య తిరుపతిలో ఉద్యోగం చేస్తున్నారు. దీంతో ఆయన తిరుపతిలోనే ఉంటున్నారు. ఆయన మానసిక పరిస్థితి కూడా బాగా లేదని చెబుతున్నారు. దీంతో ఆయనకు అధికారులు పెద్దగా పని చెప్పడం లేదని ప్రచారం సాగుతోంది.
సెల్ఫోన్ తెచ్చుకుంటానని డ్రైవర్తో చెప్పి పైకి వెళ్లి ఐదో అంతస్థు నుంచి శ్రీధర్ దూకేశాడని అంటున్నారు. ఆ సమయంలో డ్రైవర్ కింద ఉండిపోయాడని చెబుతున్నారు. అతనిపై శాఖాపరమైన ఒత్తిళ్లేమీ లేవని చెబుతున్నారు. గత 20 ఏళ్లుగా శ్రీధర్ చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నారు. దాంతో ఆయన జిల్లాలోని చాలా మందితో స్నేహం ఏర్పడింది.
ఇదిలావుంటే, హైదరాబాద్ శివారు బండ్లగూదలో రాకేష్ అనే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గత రాత్రి చోటు చేసుకుంది. ఒక భూమి వివాదానికి సంబంధించిన వస్తున్న ఒత్తిళ్లు, వేధింపులు తాళలేక రాకేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.