హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఉరి వేయాలన్న తన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్ర రావు సోమవారం క్షమాపణ చెప్పారు. శాసనమండలి ప్రారంభం కాగానే అధికార పార్టీ నేతలు మాట్లాడుతూ... దాడి ఇటీవల ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్కు తలొగ్గిన దాడి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, అందుకు క్షమాపణలు చెబుతున్నానని మండలిలో ప్రకటించారు. అనంతరం మండలి మంగళవారానికి వాయిదా పడింది.
బాబ్లీపై ముఖ్యమంత్రికి టిడిపి వినతి
మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి బాబ్లీ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ముఖ్యమంత్రికి ఐదు జిల్లాల తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ అంశంపై ఈ నెలలోనే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాస్తారని చెప్పారు. బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని కరీంనగర్, నల్గొంజ, నిజామాబాద్, అదిలాబాద్, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడిందన్నారు.
బాబ్లీ ప్రాజెక్టుపై న్యాయవాదులు సుప్రీంకోర్టులో సరైన రీతిలో వాదించక పోవడం వల్లే తీర్పు ఆలస్యమైందన్నారు. కేంద్రం, మన రాష్ట్రం, మహారాష్ట్రలోనూ కాంగ్రెసు ప్రభుత్వమే ఉన్నందున ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందని వారి అభిప్రాయపడ్డారు.
స్పీకర్ ఇంటి ముందు ధర్నా
స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను వాయిదా వేస్తూ పరోక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేదని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. సమస్యలపై చర్చ జరగకుండా ఉండేందుకు స్పీకర్ సభను వాయిదా వేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని, ఇది బాధ్యతారాహిత్యమని వారు విమర్సించారు.
మంగళవారం నుండైనా సభ సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఇప్పుడు ప్రధాన సమస్య అయిందని, దానిపై చర్చించేందుకు ప్రభుత్వం వెనుకాడుతోందన్నారు. కాగా స్పీకర్ ఇంటి వద్ద ఆందోళనకు దిగిన పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.











