బాబు వస్తే లెక్క చూపిస్తాం: జగన్ ఆస్తిపై వాసిరెడ్డి పద్మ
జగన్ ఆస్తుల లెక్క కావాలంటే బాబు స్వయంగా వస్తే చూపిస్తామన్నారు. చంద్రబాబు గతంలో ప్రకటించిన ఆస్తులకు, ఇప్పడు ప్రకటించిన వాటికి తేడా ఉందన్నారు. 2004 ఎన్నికల అఫిడవిట్లో బాబు ఇచ్చిన వివరాలు సరైనవా లేక తాజాగా ప్రకటించిన ఆస్తులు కరెక్టా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మార్ కుంభకోణం కేసులో సిబిఐ దర్యాఫ్తు పక్షపాత ధోరణితో జరుగుతోందని ఆమె ఆరోపించారు.
ఈ కేసులో సిబిఐ అసలు దోషులను వదిలేయడం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబు, కాంగ్రెసు పెద్దలను కాపాడేలా సిబిఐ దర్యాఫ్తు చేసిందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని, ఆయన మనుషులను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం సిబిఐ చేస్తోందన్నారు. ఇది కుట్ర పూరితంగా జరుగుతోందని, ఏకపక్షంగా సిబిఐ దర్యాఫ్తు చేయడం సరికాదన్నారు. కంపెనీలకు వందల ఎకరాలు కట్టబెట్టిన బాబును సిబిఐ ప్రశ్నించిందా అని ఆమె నిలదీశారు.
సిబిఐ బరితెగింపుకు ఇదే మంచి ఉదారహణ అన్నారు. బాబు హయాంలో ఎమ్మార్ ప్రాపర్టీస్కు భూములు కేటాయించడం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తలపించిందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ను బద్నాం చేసేందుకు సిబిఐ ప్రయత్నిస్తోందన్నారు. ఎల్లో మీడియాకు లీకులు ఇవ్వడం తప్ప సిబిఐ చేసింది, సాధించిందేమీ లేదన్నారు.