తెలంగాణపై బాబు దృష్టి: కొడంగల్ నుండి పాదయాత్ర
పాదయాత్ర ప్రారంభించే స్థలంలో ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆవశ్యకత ఏమిటి అనే విషయాలతో కూడిన శిలాఫలకం ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్, మహాత్ముడు, అంబేడ్కర్, పూలే విగ్రహాలను తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేటకు చెందిన వడయార్ వద్ద తయారు చేయిస్తున్నారు. చంద్రబాబు యాత్ర మొత్తం 117 రోజులు జరగనుంది. రోజుకు 15 కిలోమీటర్లు సాగేలా టిడిపి పాదయాత్ర షెడ్యూల్ను ఖరారు చేసింది.
కాగా చంద్రబాబు పాదయాత్రపై మొదటి నుండి తీవ్ర తర్జన భర్జన జరిగిన విషయం తెలిసిందే. తొలుత పాదయాత్ర చేయాలా లేక సైకిల్ యాత్రనా అదీ గాక ఏదైనా వాహనంలో పర్యటించాలా అనే అంశంపై చర్చ జరిగింది. పాదయాత్ర చేస్తే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని అనుకరించినట్లుగా ఉంటుందని కొందరు బాబు దృష్టికీ తీసుకు వచ్చారు. అయితే దేశంలో ఎందరో పాదయాత్ర చేశారని, స్వర్గీయ ఎన్టీఆర్ కూడా చేశారని, పాదయాత్ర ఏ ఒక్కరికో సొంతం కాదని అంతిమంగా ఆ యాత్రకే బాబు జై కొట్టారు.
ఇక పాదయాత్ర ఎక్కడి నుండి ప్రారంభించాలనే అంశంపై కూడా జోరుగా చర్చ జరిగింది. అదిలాబాద్ జిల్లా ఉట్నూరు నుండి ప్రారంభించాలని తొలుత అనుకున్నారు. అయితే అపసవ్య దిశలో సాగరాదని పండితులు అభ్యంతరాలు చెప్పారని సమాచారం. వాస్తుదోషంతో ఇది క్యాన్సల్ అయిందని అంటున్నారు. అనంతపురం జిల్లా నుండి మొదలు పెడితే సవ్య దిశ అవుతుందని సూచించారట. కానీ తెలంగాణ నుండి పాదయాత్ర ప్రారంభించాలని బాబు నిర్ణయించుకున్న నేపథ్యంలో అంతిమంగా రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నుండి ఖరారైంది.
ఇటీవల తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ దెబ్బతిన్నది. అయితే కొద్ది రోజులుగా క్రమంగా మళ్లీ పుంజుకుంటోంది. అలాగే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు కూడా చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో దెబ్బతిన్న పార్టీని, నిస్తేజంగా ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకే చంద్రబాబు ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతం నుండి ప్రారంభించాలని భావించినట్లుగా కనిపిస్తోంది.
కాగా ఈ పాదయాత్రలో హీరో, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ కూడా పాలుపంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో మాట్లాడిన బాలయ్య చంద్రబాబు కోరితే తాను పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి.