తప్పులు దిద్దుకునేందుకు బాబు సిద్ధం, యాత్ర ఆలస్యం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిడిపి హయాంలో ప్రజల సంక్షేమానికే పెద్ద పీట వేశామన్నారు. కానీ కాంగ్రెసు పార్టీ నేతలు మాత్రం ప్రజల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిండుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. పేదవారికి న్యాయం జరగాలనే తాను ఈ యాత్రను చేపట్టానని తెలిపారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అన్ని కులాలకు సమ న్యాయం జరగాలన్నారు.
కానీ కాంగ్రెసు పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని, దానిని విదేశాలలో దాచుకుంటున్నారని ఆరోపించారు. పేదవారికి ఆర్థిక స్వాతంత్ర్యం రావాలన్నారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకొని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం తినే తిండి పైన, కట్టుకునే బట్టల పైనా 14 శాతం పన్ను విధించారని విమర్శించారు. మహిళలకు రాజకీయ గుర్తింపు అవసరమన్నారు.
కాగా బాబు తనయుడు నారా లోకేష్ కుమార్ రెండో రోజు బాబు వెంటే ఉన్నారు. చంద్రబాబు మంగళవారం వస్తున్నా మీకోసం పేరుతో సూగురు నుండి పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. స్థానికులు రాత్రి ఒకటిన్నర గంటల వరకు బాబును కలిసేందుకు వచ్చారు. దీంతో బుధవారం ఉదయం యాత్ర అనుకున్న సమయానికంటే ఆలస్యంగా ప్రారంభమైంది.