పర్మిషన్ అవసరంలేదు, కుప్పంఅంటే ఊరుకోరు: లోకేష్
తాను 1995 నుండే పార్టీ కోసం పని చేస్తున్నానని, 1999 నుండి క్రియాశీలకంగా ఉన్నానని, పార్టీలోకి వచ్చేందుకు తనకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. తన తండ్రి పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాలు పంచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో లెక్కలేనన్ని ప్రజా సమస్యలు ఉన్నాయని, ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు బాబు కోసం రాత్రి రెండు గంటల వరకు వేచి చూస్తున్నారన్నారు.
రాజకీయాలలోకి రావడం గొప్ప విషయమేమీ కాదన్నారు. కుప్పం నుండి పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించింది. దానికి లోకేష్... కుప్పం ప్రజలకు చంద్రబాబు దేవుడు అని, అక్కడి నుండి తాను పోటీ చేస్తే కుప్పం ప్రజలు ఒప్పుకోరని చెప్పారు. 2009 ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించానని చెప్పారు. ఇకపై పార్టీ పటిష్టతపై సీరియస్గా దృష్టి సారిస్తానని లోకేష్ చెప్పారు. పాదయాత్రకు కుటుంబ సభ్యులు హాజరవుతారన్నారు.
కాంగ్రెసు ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందన్నారు. పాదయాత్ర విజయవంతమవుతుందని లోకేష్ ఆకాంక్షించారు. అడుగడుగునా బాబు పాదయాత్రకు అనూహ్య స్పందన కనిపిస్తోందన్నారు. ప్రజలే స్పచ్చంధంగా పాదయాత్రలో పాల్గొంటున్నారని చెప్పారు. కాగా పలువురు నాయకులు, కార్యకర్తలు లోకేష్ను కలిసి రాజకీయాల్లోకి రావాలని కోరారు. అతను మీడియా చిట్ చాట్లో తాను ఎప్పటి నుండో పార్టీలో ఉన్నానని చెప్పారు.