లోకేష్ హల్చల్: కలివిడిగా ఉంటూ.. ఆసక్తిగా వింటూ..
బుధవారం యాత్ర ముగిసే వరకు లోకేష్ తండ్రితోనే ఉన్నారు. కార్యకర్తలు, ప్రజలు లోకేష్ను కలిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయనతో కరచాలనం చేసేందుకు, ఫోటోలు దిగేందుకు పోటీ పడుతున్నారు. నారా లోకేష్ యాత్రలో బాబుకు కాస్త వెనుకగా ఉండి నడుస్తూ... యువకులతో కలివిడిగా ఉంటున్నారు. వృద్ధులకు, పెద్దవారికి నమస్కరిస్తూ వారితో మాట్లాడుతున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ యాత్ర సాగించారు.
కాగా నారా లోకేష్ రెండు రోజుల పాటు చంద్రబాబుతో యాత్రలో పాల్గొంటారని ముందుగా తెలిసిందే. గురువారం ఆయన తిరిగి హైదరాబాద్ రానున్నారు. పార్టీ వర్గాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించాయి. లోకేష్ రేపు హైదరాబాద్ వెళ్లనున్నారని చెప్పారు. రెండు రోజుల పాటు తండ్రికి సంఘీభావంగా... ప్రజల సమస్యలు వినేందుకు ఆయన కూడా వచ్చారని తెలిపారు. అయితే యాత్ర మధ్యలో అప్పుడప్పుడు పాల్గొంటారని చెప్పారు.
కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర గురువారం ఉదయం సోమందేపల్లి నుండి ప్రారంభమైంది. మూడో రోజు యాత్రకు కూడా గత రెండురోజుల్లాగే భారీగా కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చారు. చంద్రబాబు బుధవారం ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.