బాబుకు కండరాల నొప్పి, ఫిజియో థెరపిస్టుల సేవలు
పాదయాత్రతో పాటు వెంట ఉండే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టుకు చెందిన డాక్టర్ పవన్, ఫిజియో థెరపిస్టు శ్యాంసుందర్ ఆయనకు సేవలందించారు. పట్టేసిన కండరాలకు మసాజ్ చేశారు. ఆయనకు కొన్ని సూచనలిచ్చారు. సాయంత్రం గొర్రెల పెంపక క్షేత్రం వద్ద కూడా మరోసారి వైద్య సేవలందించారు. రెండో రోజు నిర్దేశించిన దానికన్నా ఎక్కువ దూరం నడవడంతో ఆయన ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఇక మూడోరోజు యాత్ర పూర్తయ్యాక రాత్రి మరోసారి చంద్రబాబుకు ఫిజియోథెరపీ చేశారు.
కండరాలు పట్టేయడంతో గురువారమే ఆయనకు మూడుసార్లు ఫిజియోథెరపీ చేయాల్సి వచ్చింది. కాగా శుక్రవారం ఉదయం చంద్రబాబు పాదయాత్ర అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని ఎల్జిపి నగర్ నుండి ప్రారంభమైంది. కోగిర మీదుగా రాగి మేకలపల్లి చేరుకుంటారు. భోజన విరామానంతరం బిసి కాలనీ, రాచూరు, యర్రబెంచి మీదుగా రాప్తాడు నియోజకవర్గంలోని గరిక మేకలపల్లి చేరుకొంటుంది. తురకలపట్నంలో విద్యార్థులతో మాట్లాడారు. గురువారమే లోకేష్, భువనేశ్వరి హైదరాబాద్ బయలుదేరారు.
మరోవైపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్.. స్థానిక పోలీసులు.. టీడీపీ వలంటీర్లు బాబుకు పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. పాదయాత్రలో బాబు వ్యక్తిగత భద్రతా సిబ్బంది అయిన ఎన్ఎస్జీ కమెండోలు ఆయనను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పాదయాత్ర బాటలో స్థానిక పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీఎస్పీ కోలార్ కృష్ణ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద ప్రదేశాలకు ప్రత్యేక సిబ్బందిని పంపుతున్నారు. కల్వర్టుల వద్ద సిబ్బందిని ఉంచారు. డీఎస్పీతోపాటు ఏడుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు బందోబస్తును పర్యవేక్షించారు.