పరిటాలది ప్రభుత్వ హత్యే: బాబు, వెంట పరిటాల శ్రీరామ్
పేదలపై దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని కాంగ్రెస్, వైఎస్సార్ పార్టీలను హెచ్చరించారు. జిల్లాలో హత్యా రాజకీయాలు దారుణమని చంద్రబాబు అన్నారు. పరిటాల స్ఫూర్తితో వేలాది మంది యువకులు పనిచేస్తున్నారని అన్నారు. పేదలకు తమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ప్రజలు చందమామను అడగడం లేదని, సమస్యలు పరిష్కరించాలని అడుగుతున్నారని ఆయన అన్నారు.
వ్యవసాయాన్ని లాభసాటి చేసే వరకు పోరాటం సాగుతుందని చెప్పారు. తల్లి, పిల్ల కాంగ్రెసులు కలిసి చంచల్గుడా జైలును సచివాలయంగా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.
ప్రజల కనీస అవసరాలు పట్టించుకోని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి విచిత్రమైన వ్యక్తి అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తిమ్మాపురంలోని ఎస్సీ కాలనీలో సహపంక్తి భోజనం చేసిన ఆయన చిన్నారిని ఎత్తుకుని ముద్దు చేశారు. అక్కడ ఏర్పాటు చేసి సభలో బాబు మాట్లాడుతూ తమ పార్టీ ప్రభుత్వం విద్యుత్ను అభివృద్ధి చేస్తే, వైఎస్ వచ్చి పెత్తనం చెలాయించాడని విమర్శించారు.
అనంతపురం ప్రజలు నీటిని కొనుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇంత అధ్వాన్నమైన పరిపాలనను తన రాజకీయ చరిత్రలో చూడలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ తొమ్మిది సంవత్సరాల పాలనలో అన్ని రంగాలు కుంటుపడ్డాయని ఆరోపించారు. ప్రభుత్వం ఫ్లోరైడ్ నీటిని తాగిస్తూ ప్రజలను వికలాంగులను చేస్తోందని ఆయన విమర్సించారు. బాబు ప్రసంగం తర్వాతం పరిటాల శ్రీరామ్ మాట్లాడాలని కార్యకర్తలు అడగ్గా శ్రీరామ్ మాట్లాడడమే కాదు, నాయకత్వం వహిస్తాడని చంద్రబాబు తెలిపారు.
రాప్తాడు నియోజవర్గంలో ప్రారంభించిన చంద్రబాబు పాదయాత్ర ఎంసీ పల్లి, తిమ్మాపురం, ఎస్సీ కాలనీ మీదుగా రెడ్డివారి పల్లి క్రాస్ చేరింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం కొండాపురం, చిన్న కొండాపురం, నక్కెలవారి పల్లి, సజ్జయ్యవారి కొట్టాల మీదుగా పేరూరుకు చంద్రబాబు చేరనున్నారు. పాదయాత్రలో పేదలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. పేరూరులో చంద్రబాబు రాత్రి బస చేయనున్నారు.