కాంగ్రెసు కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్: చంద్రబాబు
చంద్రబాబు పాదయాత్ర ఎనిమిదో రోజు మంగళవారం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని నారాయణపురం క్రాస్ నుంచి ప్రారంభమైంది. మంగళవారం 18.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించి బెళుగుప్ప మండలం విరూపాపల్లి క్రాస్ వద్ద బస చేశారు. మంత్రి రఘువీరా ఇలాకా కళ్యాణదుర్గంలో ప్రజలు బాబుకు నీరాజనం పలికారు. ఇక్కడే చంద్రబాబు కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. అవినీతి, కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్గా కాంగ్రెస్ మారిందన్నారు. "టీడీపీ హయాంలో విద్యా రంగంలో ప్రవేశపెట్టిన వినూత్న పద్ధతుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది యువతీ యువకులు ఉద్యోగాలు సంపాదించారు.
తన హయాంలో రాష్ట్రానికి నాలెడ్జి హబ్గా ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చానని, కానీ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని అవినీతి కుంభకోణాల్లోకి నెట్టిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదని, వ్యవసాయ మోటార్లు ఆడవు, వీధిలైట్లు వెలగవు, తాగేందుకు నీళ్లు కూడా దొరకవని ఆయన అన్నారు. రాని కరెంటుకు 15 రెట్లు చార్జీలు పెంచి వసూలు చేస్తున్నారని అన్నారు.
ఇంటి పన్ను పెంచేశారని, అన్ని ధరలూ పెంచేసి.. దోపిడీ చేసేసి కనీసం తాగునీరు కూడా సక్రమంగా అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత ఎక్కడ ఉందని ఆయన అన్నారు. యువత, విద్యార్థి లోకం అవినీతిపరుల గుండెల్లో నిద్రపోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగంతోపాటు నెలకు రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతి కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. మిగులు బడ్జెట్తోపాటు మిగులు విద్యుత్ కూడా అందించిన ఘనత తమదేనని చెప్పారు. కాంగ్రెస్ పాలన దాదాపు గాడి తప్పిందని, దానిని గాడిలో పెట్టే బాధ్యతను తమ పార్టీ తీసుకుంటుందని, ఇందుకు ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి రఘువీరా రెడ్డి బ్రహ్మాండమైన ప్యాలెస్ నిర్మించుకున్నారు గానీ ప్రజలకు ఏమాత్రం మౌలిక సదుపాయాలు కల్పించలేదని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడ్డ మంత్రుల్లో ఇప్పటికే కొందరు చంచల్గూడ జైల్లో ఉన్నారని, మరికొందరు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని, కేబినెట్ సమావేశాలు అక్కడే పెట్టుకునే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. వాల్మీకులు, వడ్డెరలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తామని, వారిని ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు.