బాబుపై పిటిషన్లన్నీ కొట్టేశారు, విజయమ్మకు..: రేవంత్
తమ పార్టీ అధినేతపై వివిధ పార్టీల నేతలు వేసిన పిటిషన్లు అన్నీ తిరస్కరించబడ్డాయని ఆయన చెప్పారు. ఐఎంజి వ్యవహారంపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వేసిన పిటిషన్ను కోర్టు ఎప్పుడో కొట్టి వేసిందన్నారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా ఐఎంజిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని నివేదిక ఇచ్చాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ అధినేతపై సిబిఐ దర్యాఫ్తు అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
తిరగదోడే కుట్ర
ఐఎంజి భూముల వ్యవహారాన్ని చంద్రబాబు మెడకు మరోసారి చుట్టేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అనంతపురం జిల్లాలో శాసనమండలి సభ్యుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గతంలో జరిగిన విచారణల్లో బాబు నిర్దోషిగా బయటపడ్డారని, మళ్లీ అదే వ్యవహారాన్ని తిరగదోడేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రకు జనం స్పందన చూసి తట్టుకోలేకే ఇలా వేధింపు చర్యలకు సిద్ధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా అంతకుముందు పార్టీ సీనియర్ నేత పయ్యావుల మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం రాయబారం నడుపుతున్నట్లుగా కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ బుధవారం విమర్శించారు. అనంతపురం జిల్లాలో ఆయన మాట్లాడారు. జగన్, తన పార్టీ ఢిల్లీ పెద్దల మధ్య కిరణ్ చీఫ్ మీడియేటర్గా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు.
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఐఎంజి భూముల కేసులో సిబిఐ విచారణ జరిపిస్తానని కిరణ్ చెప్పడం సరికాదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశాక పరిణామాలు మారుతున్నట్లుగా కనిపిస్తోందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. విజయమ్మతో ప్రణబ్ భేటీ పూర్తైన తర్వాతే కిరణ్ తమ పార్టీ అధినేతపై సిబిఐ దర్యాఫ్తు అని చెప్పారని గుర్తు చేశారు.
ఐఎంజి కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి నేత సిబిఐని సమాచారం అడిగితే, దానిని తీసుకొని జగన్కు చెందిన విజయ సాయి రెడ్డి కోర్టుకు వెళ్తాడని, ఇప్పుడు కిరణ్ కోర్టు తీర్పు కంటే ముందే తీర్పు చెబుతున్నారని, ఇదంతా చూస్తుంటే ఓ కుట్ర ప్రకారం జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. కాంగ్రెసు తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉందని, ఇప్పటి వరకు ప్రాథమిక ఆధారాలు కూడా బాబుకు వ్యతిరేకంగా సేకరించలేక పోయిందని చెప్పారు.
కిరణ్ మాటలను చూస్తుంటే వారు జడ్జీలతో ఏమైనా మాట్లాడుతున్నారా అనే అనుమానం వస్తుందన్నారు. కోర్టులో విచారణ జరుగుతున్న ఇలాంటి సమయంలో వారు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడి కోర్టులను ప్రభావితం చేయాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు.