మహంకాళీ అమ్మవారి నగల చోరీ: పాతబస్తీలో ఉద్రిక్తత
అమ్మవారి నగలను చోరీ చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, చోరీపై అధికారులు సమాధానం చెప్పాలని భక్తులు డిమాండ్ చేశారు. మహంకాళీ అమ్మవారి భక్తులు భారీగా గుడి వద్దకు తరలి వచ్చారు. పాదయాత్రతో ర్యాలీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
నగర కమిషనర్ అనురాగ్ శర్మ అక్కడకు చేరుకున్నారు. ర్యాలీకి అనుమతిలేదని పోలీసులు భక్తులను అడ్డుకున్నారు. దీంతో భక్తులు అక్కడ బైఠాయించారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి రావాలని, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆలయ కమిటీ సభ్యులతో అనురాగ్ శర్మ చర్చలు జరుపుతున్నారు.
కాగా అమ్మవారి నగల చోరీ కేసులో పదకొండు మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితులు ఎవరో తేలుస్తామని చెప్పారు. భక్తులకు విశ్వహిందూ పరిషత్, బజరంగ దళ, ఆలయ కమిటీ సభ్యులు మద్దతు పలికారు. కాగా మంత్రి గీతారెడ్డి వచ్చి హామీ ఇవ్వడంతో భక్తులు తమ ఆందోళనను విరమించుకున్నారు.