బ్రాహ్మన్లకు రుణపడ్డాం: దేనికైనా రెడీపై లక్ష్మీపార్వతి ఫైర్
ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడారు. ఓ వ్యక్తిని నిందించడం కాకుండా సినీ పరిశ్రమను ప్రక్షాలన చేయవల్సిన అవసరం ఉందన్నారు. బ్రాహ్మణ అనే శబ్దమే ఈ దేశాన్ని నిలబెట్టిందని అన్నారు. ఎన్ని యుద్ధాలు, దండయాత్రలు జరిగినా మన దేశం ప్రపంచంలో ఆదర్శప్రాయంగా నిలిచిందని, ఒక్క భారతదేశమే లేకపోతే ప్రపంచమే అన్నింటిని కోల్పోతుందని స్వామి వివేకానంద అన్నారని గుర్తు చేశారని, దేశం బ్రాహ్మణులకు రుణపడి ఉందన్నారు.
బ్రాహ్మణులను అగౌరవపరచడం అంటే తల్లి, చెల్లి, కూతురిని అవమానపరుచుకోవడమేనని అన్నారు. 100 సినిమాలు నిర్మిస్తే రెండు సినిమాలు కూడా విజయం సాధించని పరిస్థితి ఉందని, అలాంటి చిత్ర పరిశ్రమ సంస్కృతి సంప్రదాయాలను కించపరిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బ్రాహ్మణులంటే అపారమైన గౌరవం ఉందని వివరించారు.
తాను బ్రాహ్మణుడినేనని, మీతో కలిసి పోరాడటానికి సిద్ధమని శ్రీధర్ బాబు అన్నారు. మనం 21వ శతాబ్దంలో ఉన్నామని, బ్రాహ్మణ మహిళలనే కాదు ఏ మహిళను కూడా, ఎవరి వృత్తిని కూడా అగౌరవపరచొద్దని సూచించారు. ఎమ్మెల్సీ చుక్కారామయ్య మాట్లాడుతూ సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరచడం, బ్రాహ్మణులను అవహేళన చేయడం వంటి ఘటనలతో సభ్యసమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు.