విభేదాలు బయటచూస్కుంటా: కిరణ్తో భేటీపై కోమటిరెడ్డి
శ్రీశైలం సొరంగ మార్గం పనులు, జిల్లాకు రావాల్సిన నిధులపై తాను ముఖ్యమంత్రితో చర్చించానని కోమటిరెడ్డి చెప్పారు. తమ మధ్య ఎన్ని బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ డిసిసిబి అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవంగానే జరుగుతుందన్నారు. అధ్యక్షుడి ఎన్నికపై నిర్ణయం జరిగిందన్నారు. ఆ పేరును తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. తమ మధ్య రాజకీయ విభేదాలు ఉంటే వాటిని బయట చూసుకుంటామని ఆయన చెప్పారు.
కాగా అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డిలు సోమవారం ఉదయం ఒకే వాహనంలో కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి, గుత్తాలు ఉదయం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం వారిద్దరూ సిఎం కాన్వాయ్లోనే సచివాలయానికి చేరుకున్నారు.
వాహనంలో ముందు సీట్లో కిరణ్ కూర్చోగా వెనుక సీట్లో కోమటిరెడ్డి కూర్చున్నారు. ముఖ్యమంత్రిపై ఒంటికాలిపై లేచే కోమటిరెడ్డి వెంకట రెడ్డి సిఎం కాన్వాయ్లో కనిపించడం గమనార్హం. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు అయన మృతి తర్వాత అప్పుడప్పుడు సొంత పార్టీ పైన నిప్పులు చెరుగుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనను ప్రత్యేకంగా టార్గెట్గా చేసుకొని ధ్వజమెత్తిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.