రాజకీయాలకు నిర్మాత బండ్ల గణేష్ పావు అయ్యారా?
స్వయంగా బండ్ల గణేష్ కూడా సామాజిక వెబ్ సైట్లో ఇదే విధంగా స్పందించారు. తాను కష్టపడి పైకొచ్చానని, తన వద్ద ఉన్న ప్రతి రూపాయి తన చెమటతో సంపాదించిందేనని, తాను ఎవరికీ బినామీని కాదని, తాను రాజకీయాల్లో లేనని, రాజకీయ లబ్ధి కోసం తనను బలి చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తనపై అనవసర బురద జల్లడం మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయాల కోసం తనను బలి చేస్తున్నారనే అభిప్రాయపడ్డారు.
బండ్ల గణేష్తో పాటు పలువురు ఆయన రాజకీయాలకు పావుగా మారారని అంటున్నారు. గణేష్కు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓ ఫంక్షన్లో అధికార పార్టీకి చెందిన ఆ నేత గురించి గణేష్ చేసిన వ్యాఖ్యలు టిడిపికి విమర్శనాస్త్రాలుగా ఉపయోగపడ్డాయి. గణేష్ ఇళ్లు, కార్యాలయాలపై దాడిపై టిడిపి స్పందిస్తూ.. గణేష్ వెనుక ఉన్న వారి ఇంట్లోనూ సోదాలు చేయాలని డిమాండ్ చేశారు.
అధికార పార్టీలో రాజకీయ ఆధిపత్యం నెలకొని ఉంది. దీంతో ఒకరిని దెబ్బతీసేందుకు మరొకరు తన మెదడుకు పదను పెడుతున్నారు. ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇలా ఒకరిపై మరొకరు దెబ్బతీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బండ్ల గణేష్ చెప్పినట్లుగా ఇప్పుడు వారి రాజకీయ క్రీడలో ఇతను పావుగా మారి ఉండవచ్చుననే చర్చ సాగుతోంది.