ఆరా తీస్తున్నారు: ఎదురీత తప్పదా?
ఇటీవలే జైపూర్ మేధో మధన సదస్సులో ఏఐసిసి ఉపాధ్యక్షుడిగా నియమితులైన రాహుల్ గాంధీ కాంగ్రెసు పార్టీ బలోపేతం పైన దృష్టి సారించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనే సంకేతాలను పార్టీ వర్గాలకు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఇస్తున్నారు. గతంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో భేటీ అయిన రాహుల్... తాజాగా ఆయా కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులతో భేటీ అవుతున్నారు.
శుక్ర, శనివారం రెండు రోజులు ఆయన నేతలతో భేటీ అవుతున్నారు. భేటీలో రాహుల్ గాంధీ ఆయా రాష్ట్రాల నేతల నుండి స్థానికంగా పార్టీ పరిస్థితిపై అడిగి తెలుసుకుంటున్నారు. మార్పులు, చేర్పులపై ఆరా తీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలువాలంటే ఏం చేయాలో సమావేశంలో రాహుల్ సూచిస్తున్నారట. అలాగే పార్టీ నేతల నుండి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారట. రాహుల్ పార్టీ సంస్థాగత ఎన్నికల పైన దృష్టి సారించారు. ఈ భేటీలో ఒక వ్యక్తికి ఒకే పదవిపై కూడా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కీలకం
ఈ భేటీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు హాజరయ్యారు. కాంగ్రెసు పార్టీకి మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ కీలకం. అయితే, ఇటీవల ఆ పార్టీ రాష్ట్రంలో ఎదురీత ఈదుతోంది. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో సెంటిమెంట్ ప్రభావం, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులు కొరకురాని కొయ్యలా తయారయ్యారు.
సీమాంధ్రలో జగన్ హవా, తెలంగాణలో తెరాస హవా కొనసాగుతోంది. అదే సమయంలో ఇప్పటి వరకు పార్టీకి పెద్దగా పట్టులోని బిజెపి క్రమంగా తెలంగాణ ప్రాంతంలో నిలదొక్కుకుంటోంది. ఈ పరిణామాలపై రాహుల్ దృష్టి సారించినట్లుగా సమాచారం. ఎపి కీలకం కావడంతో ఆయన ఎపి పైన దృష్టి సారించారని అంటున్నారు. కిరణ్ ప్రవేశ పెట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ విషయాన్ని రాహుల్ అడిగి తెలుసుకున్నారట.
ఈ సబ్ ప్లాన్ ప్రభావం ఏ మేరకు కాంగ్రెసు పార్టీకి కలిసొస్తుంది? ఇంకా ఏం చేయాలి? పార్టీలో ఎలా బలోపేతం చేయాలి? తదితర అంశాలపై రాహుల్ కిరణ్, బొత్సలను అడిగి తెలుసుకున్నారట. సీమాంధ్రలో జగన్ను, తెలంగాణలో తెరాస, బిజెపిలను ఎదుర్కోవటంపై ప్రశ్నించినట్లుగా సమాచారం. వీటి వల్ల అధికార కాంగ్రెసుకు ఎక్కువ నష్టమా? లేక ప్రధాన ప్రతిపక్షం టిడిపికి నష్టమా? అనే విషయంపై కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆయా పార్టీల పరిస్థితిపై అడిగి.. కాంగ్రెసును బలోపేతం చేసే విషయంపై చర్చించారట.
రాహుల్ తనకు కావాల్సిన పలు సమాధానాలను ప్రశ్నలు వేసి.. కిరణ్, బొత్సల నుండి రాబట్టుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని కొత్త పొత్తులు, వాటి వ్యూహాలపై కూడా చర్చించినట్లుగా సమాచారం. క్షేత్రస్థాయిలోని వివరాలు అడగడంతో పాటు సహకార ఎన్నికల ఫలితాల వివరాలను అడిగినట్లుగా తెలుస్తోంది. ఎపిలో పార్టీ పరిస్థితి, ప్రత్యేక తెలంగాణ, జగన్ అంశాలపై కిరణ్, బొత్సలు రాహుల్కు వివరించారు.