పేలుళ్ల సూత్రధారి రియాజ్? ఉదయమే హెచ్చరికలు
ఆ కేసులో 15 మందిని అరెస్ట్ చేశారు. మరో పదిమంది కోసం గాలింపు కొనసాగుతోంది. అరెస్టు చేసిన వారిలో 12 మందిపై ఎన్ఐఏ వర్గాలు బుధవారం చార్జిషీటు దాఖలు చేశాయి. దీంతో పాటు కేంద్ర హోం శాఖకు ఒక నోట్ సమర్పించారు. అందులో ప్రధానంగా మూడు అంశాలను పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. విచారణ క్రమంలో నిందితులు తమ తదుపరి లక్ష్యం హైదరాబాదే అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
ఆర్డీఎక్స్ లాంటి అత్యంత తీవ్రమైన పేలుడు పదార్థాలు ఉపయోగిస్తామని, టిఫిన్ బాక్సులు లేదా రేడియోలు వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకుని బాంబులు అమరుస్తామని ఉగ్రవాదులు విచారణలో చెప్పినట్లు ఎన్ఐఏ వర్గాలు హోంశాఖకు తెలియజేశాయి. దీని ఆధారంగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం ఉదయమే రాష్ట్ర పోలీసులను హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. కేంద్రం హెచ్చరించిన సాయంత్రమే పేలుళ్లు జరగటం గమనార్హం.
ఎన్ఐఏకు ఇంకా దొరకని వారిలో కరడుగట్టిన ఉగ్రవాది, కర్ణాటకకు చెందిన రియాజ్ భత్కల్ కూడా ఉన్నాడు. హైదరాబాద్ పేలుళ్ల వెనుక ప్రణాళిక రియాజ్దేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చార్జిషీట్ దాఖలైన పన్నెండు మంది ఉగ్రవాదులు లష్కరే తాయిబా, హుజి సంస్థలకు చెందినవారు.