మక్బూల్కు క్షమాభిక్ష పెట్టిన వైయస్, కిరణ్ రెడ్డి రద్దు
సత్ప్పవర్తన కలిగిన ఖైదీల విడుదలలో భాగంగా మక్బూల్ జైలు నుంచి విడుదలయ్యాడు. మక్బూల్కు వైఎస్ క్షమాభిక్ష ప్రకటించడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి దీనికి సంబంధించిన జీఓ 338, హోం డేటెడ్ 24-7-2009న రెమిషన్ కోసం మార్గదర్శకాలు రూపొందించేందుకు వైయస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ తర్వాత సెప్టెంబర్ 2న వైయస్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన రోశయ్య ఆ జీఓను యధాతథంగా అమలుచేశారు. ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్లో ఉన్న మక్బూల్ను దిల్సుఖ్నగర్ బాంబు పేలుడు కేసు నేపథ్యంలో నగరానికి తీసుకువచ్చి, సోమవారమే ఢిల్లీకి తరలించారు. వైయస్ క్షమాభిక్షతో జైలు నుంచి బయటకు వచ్చిన మక్బూల్ 2012లో ఉగ్రవాద కార్యక్రమాల్లో పాల్గొనడంతో అరెస్టయ్యాడు. హైదరాబాద్ నగరంలో 10 చోట్ల పేలుళ్లకు రిక్కీ నిర్వహించాడు.
మక్బూల్కు క్షమాభిక్ష పెట్టిన విషయాన్ని బాంబు పేలుళ్ల తర్వాత జరిగిన సమీక్ష సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి ఆలస్యంగా తీసుకువెళ్లారు. హోంమంత్రి సబిత కూడా దానిపై సమీక్ష నిర్వహించారు.
ఆ ఫైలు వైయస్ వద్దకు ఎలా వెళ్లింది?: కిషన్రెడ్డి
మక్బూల్, ముజీబ్ క్షమాభిక్ష ఫైళ్లు నాటి ముఖ్యమంత్రి వైయస్ వద్దకు ఎలా వెళ్లాయో విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా మంచి పని చేశారన్నారు. అధికారులే పంపించారా? వైఎస్ తెప్పించుకున్నారా అన్న విషయం తేల్చాలి. ఈ ఫైళ్లకు సంబంధించిన అన్ని వివరాలు ప్రతి దిశలో జరిగిన అన్ని అంశాల ను సర్కారు బయటపెట్టాలన్నారు. ఈ విధంగా క్షమార్హం కాని, కరుడుగట్టిన నేరస్థులను విడుదల చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పులతో చెలగాటమాడుతూ ప్రజలను బలితీసుకుం టోంది.
కరుడుగట్టిన నేరస్థులను వదిలేసిన తర్వాత వారేం చేస్తున్నారన్న దానిపై నిఘా లేకపోవడం దారుణం. కరుడుగట్టిన నేరస్థుల విడుదల, క్షమాపణ విషయంలో సీఎం విచక్షాధికారం కింద కాకుండా దేశ సమగ్రత, సమైక్యతకు సంబంధించిన అంశంగా చూడాలే తప్ప, వ్యక్తిగత నిర్ణయం, విచక్షణాధికారం కింద చూడ కూడదని స్పష్టం చేశారు.