హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం చేయడంపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు చేస్తున్న విమర్శలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కౌంటర్ అటాక్ ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. జగన్ ముఖ్యమంత్రి పదవి కోసమే కాంగ్రెసు పార్టీని వీడారంటూ పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దానిని జగన్ పార్టీ నేతలు ఖండిస్తున్నారు.
అయితే, అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపు అని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేర్చడం ఆయనకే సాధ్యమని ప్రచారం చేస్తున్నారు. జగన్ను ముఖ్యమంత్రిగా చెప్పడంపై అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో ఇప్పుడు జగన్ పార్టీ కొత్తగా అధికార పార్టీతో పాటు ప్రతిపక్షంపై అటాక్ చేస్తోంది.
ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని భవిష్యత్తు ప్రధానమంత్రిగా కాంగ్రెసు పార్టీ ఫోకస్ చేస్తున్నప్పుడు తాము తమ పార్టీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రిగా ఫోకస్ చేయడంలో తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. టిడిపి చంద్రబాబునే ముఖ్యమంత్రిగా చెబుతున్నారని అలాంటప్పుడు తమను విమర్శించడమేమిటన్నారు. అయితే, జగన్ మాత్రం ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ వీడారనే వార్తలు మాత్రం అవాస్తవమంటున్నారు.
ఇటీవల జైపూర్ మేధోమథనం సదస్సులో రాహుల్ గాంధీకి ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అంతకు ముందు నుండే కాంగ్రెసు రాహుల్ను ప్రధానిగా ఫోకస్ చేస్తోంది. ఉపాధ్యక్ష బాధ్యతల అనంతరం అది మరింత ఎక్కువయింది.











