విశాఖపట్నం: ఇండియన్ నేవీ హెలికాప్టర్ విశాఖపట్నం వద్ద సముద్రంలో కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నావికాదళం అధికారులు ధ్రువీకరించారు. ఘటన మాత్రం జరిగిందని అంటున్నారు గానీ దాని వివరాలను మాత్రం చెప్పడం లేదు. ఇండియన్ నేవీ చేతక్ హెలికాప్టర్ సముద్రంలో కూలినట్లు సమాచారం. ఈ ఛేతక్ - 445 హెలికాప్టర్లో నలుగురు నావికాదళ సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
నలుగురు సిబ్బందిలో ఇద్దరి ఆచూకీ దొరికినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. హెలికాప్టర్ డాల్ఫిన్స్ నోస్కు పది నాటికల్ మైళ్ల దూరంలో కూలినట్లు తెలుస్తోంది. ఇది మంగళవారం మధ్యాహ్నం 2 రెండు గంటలకు తూర్పు నావికాదళ కేంద్రం నుంచి బయలుదేరిందని, సాయంత్రం 3 గంటల నుంచి దాని రాడార్ సంకేతాలు అందడం లేదని అంటున్నారు.
సమాచారం బయటకు రావడానికి కూడా చాలా సమయం పట్టింది. అధికారులు మిగతా ఇద్దరి కోసం తీవ్రంగా గాలించగా, ఒకరి మృతదేహం లభించినట్లు తెలుస్తోంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. వివరాలు అందాల్సి ఉంది.



















