న్యూఢిల్లీ: ఓ ఇంటర్మీడియేట్ విద్యార్థి టీచర్ పైనే అత్యాచారానికి పాల్పడిన సంఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. దేశ రాజధానిలో ఇటీవల ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతున్నాయి. తాజాగా టీచర్ పైన విద్యార్థి అత్యాచారం చేయడం గమనార్హం. ఇంట్లో ట్యూషన్ చెబుతుండగా సదరు విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.
అత్యాచారయత్నం కేసులో ఉరిశిక్ష
గిరిజన బాలికపై అత్యాచారం చేసి, హత్యచేసిన యువకుడికి మధ్య ప్రదేశ్లోని ఖాండ్వా కోర్టు మరణశిక్ష విధించింది. తొమ్మిది రోజుల్లోనే విచారణ పూర్తి చేసి శిక్షను ప్రకటించింది. నిందితుడు అనోఖి(21) తొమ్మిదేళ్ల బాలికను సుర్గాన్ జోషి గ్రామంలో గత జనవరి 30న కిడ్నాప్ చేశాడు.
మర్నాడు ఆ బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అనోఖిని ఫిబ్రవరి నాలుగున అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 21న కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. సాక్ష్యాలు, డిఎన్ఎ నివేదికను పరీక్షించిన న్యాయమూర్తి జగదీష్ బహేటి, అనోఖి నేరాన్ని నిర్ధారిస్తూ అతడికి మరణ శిక్ష విధించారు.
నిర్భయకు అమెరికా పురస్కారం
ఢిల్లీలో కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయకు అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ధీర వనిత అవార్డును ప్రకటించింది. లైంగిక దాడులపై పోరాడేందుకు భారత జాతిని జాగృతం చేసేలా స్ఫూర్తిని రగిలించినందుకు ఆమెకు దీనిని ఇచ్చారు. ఈ నెల 8న ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు.











