యనమల, మణి, సలీం: టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు రెడీ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేలా అదే సమయంలో ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేస్తూ ఈ ఎంపికలు జరిపారు. వీరిలో యనమల కోస్తా ప్రాంతంలో యాదవ సామాజిక వర్గానికి చెంది న సీనియర్ నేత. సలీంను తెలంగాణ ప్రాంతానికి చెందిన మైనారిటీ కోటాలో ఎంపిక చేశారు. ఆయన హైదరాబాద్ నగరానికి చెందిన పార్టీ నేత. శమంతకమణి స్వస్థలం అనంతపురం జిల్లా. ఎస్సీల్లో మాదిగ ఉప కులానికి చెందిన మహిళకు రాయలసీమ నుంచి అవకాశం ఇవ్వాలనుకొన్నప్పుడు ఆ అవకాశం ఆమెను వరించింది.
వీరిలో యనమల పేరు ఆకస్మికంగా తెరపైకి వచ్చింది. రాజ్యసభకు వెళ్లాలనే ఆసక్తితో ఉన్న యనమల ఎమ్మెల్సీ రేసుకు దూరంగా ఉన్నారు. కానీ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న బిసి నేతను ఎంపిక చేస్తే ఎన్నికల ముందు పార్టీకి ఉపకరిస్తుందని, ఆ కోణంలో యనమల పేరును పరిశీలించవచ్చని కొందరు నేతలు చేసిన సూచన అంతిమంగా ఆయన ఎంపికకు దారి తీసింది. అయితే, యనమల ఎంపిక మరో సీనియర్ నేత దాడి వీరభద్ర రావును నిరాశపర్చింది.
దాడి గత ఆరేళ్లుగా శాసనమండలిలో టీడీపీ తరపున ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తనకు కొనసాగింపు ఉంటుందనుకొంటున్న తరుణంలో యనమలకు అవకాశం దక్కడంతో ఆయన నీరసపడ్డారు. పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్న ఆయన.. అక్కడ ఈ నిర్ణయంపై ఎటువంటి వ్యతిరేక భావన వ్యక్తం చేయకుండా మౌనంగా తిరిగి వచ్చేశారు. ఆయనను ఈసారి అనకాపల్లి ఎంపీ సీటుకు నిలబెట్టవచ్చని చెబుతున్నారు.