లౌకికవాదమంటే దేశమే ఫస్ట్, మా రక్తంలోనే: మోడీ
అహ్మదాబాద్: తన దృష్టిలో లౌకికవాదం అంటే దేశానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడమేనని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. అగ్ర దేశం అమెరికా మోడీకి వీసా తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో అతను అమెరికా ప్రవాస భారతీయ సదస్సులో గుజరాత్లోని గాంధీ నగర్ నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లౌకికవాదమంటే తన దృష్టిలో దేశానికి మొదటి ప్రాధాన్యమివ్వడమే అన్నారు. అన్ని మతాలు, సిద్ధాంతాల కన్నా దేశమే పై స్థాయిలో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. మనం ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనాలే అంతిమంగా ఉండాలని చెప్పారు. తన అభిప్రాయంతో అందరూ ఏకీభవిస్తారని అనుకుంటున్నట్లు చెప్పారు.
భారత్ను మించి మరేదీ లేదన్నారు. భారత్ను పురోగమనమే మన ముందున్న మొదటి లక్ష్యమన్నారు. అదే అసలైన లౌకికవాదం అన్నారు. అలాంటి లౌకికవాదం తమ రక్తంలో ఉందని మోడీ చెప్పారు. మోడీ తన ప్రసంగంలో యూపిఏ ప్రభుత్వం గురించి మాట్లాడం పక్కన పెట్టారు. కేంద్రం గురించి మాట్లాడలేదు. అయితే, బడ్జెట్లో గుజరాత్ కేటాయింపులపై ఆయన మాట్లాడారు.
గుజరాత్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వైఖరుల గురించి చెప్పారు. ప్రజల అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం పాటు పడుతుందో చూడాలన్నారు. అదే సమయంలో తాను ఈ ప్రసంగం ద్వారా ఎవరినో కించపర్చాలని భావించడం లేదని, నిజాలు మాత్రమే మీ ముందుంచుతున్నానని చెప్పాకొచ్చారు.