తెలిస్తే బాబుపై థూ అని ఉమ్ముతారు: తెరాస
తెరాస నాయకులు నాయిని నర్సింహారెడ్డి, మధుసూదనాచారి, కర్నె ప్రభాకర్, దాసోజ్ శ్రవణ్ మంగళవారం తెలంగాణభవన్లో వేర్వేరుగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. టిడిపి నాయకులు టీఆర్ఎస్పై, పార్టీ అధినేత కేసీఆర్పై చేసిన ఆరోపణలను తప్పుపట్టారు. సూట్ కేసుల చరిత్ర చంద్రబాబుదేనని, లేకపోతే వారసత్వంగా రెండెకరాల భూమి పొందిన ఆయనకు ఇప్పుడు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని నాయని నర్సింహారెడ్డి ఆరోపించారు. కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు దమ్ముంటే ఇరువురి ఆస్తులపై సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో ముడుపుల సంస్కృతిని తెచ్చిందే బాబు అని తూర్పారపట్టారు. తెలంగాణ ఉద్యమంతో టీడీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయిందని, వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం కూడా దక్కదన్న ఆక్రోశంతోనే చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు టీఆర్ఎస్పై దుమ్మెత్తి పోస్తున్నారని అన్నారు. చంద్రబాబు మూమ్మాటికీ తెలంగాణ ద్రోహేనని పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెన్నైలో ఒక వ్యాపారి నుంచి చంద్రబాబు సూట్కేసులు తీసుకున్నారని, తరువాత విషయం తెలిసిన ఎన్టీఆర్ ఆ డబ్బు ఆ వ్యాపారికి తిరిగి ఇప్పించారని మధుసూదనాచారి ఆరోపించారు. ఆనాటి నుంచీ బాబుది సూట్కేసుల చరిత్రనేనని దుయ్యబట్టారు. చంద్రబాబు చేసేది గోబెల్స్ ప్రచారమని, ఎవరేంటో ప్రజలకు తెలుసునని కర్నె ప్రభాకర్ అన్నారు.
సత్యం రామలింగరాజుకు చౌకగా భూములు కట్టబెట్టి ప్రతిఫలంగా కొడుకును అమెరికాలో చదివించుకున్న చిల్లర నాయకుడు చంద్రబాబేనని శ్రవణ్ దుయ్యబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఐమాక్స్కు భూమి ఇచ్చి అందుకు ప్రతిఫలంగా ఆ యజమానికి ఎన్టీఆర్భవన్కు పక్కనే ఉన్న భూమిని కలిపేసుకోలేదా అని ప్రశ్నించారు. హెరిటేజ్ డెయిరీ కోసం చిత్తూరు ప్రభుత్వ డెయిరీని నాశనం చేసిందెవ్వరో చెప్పాలన్నారు. ఎఫ్డీఐలపై పార్లమెంట్లో ఓటింగ్ సందర్భంలో, అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబుకు ఎన్ని కోట్లు ముడుపులుగా అందాయని ప్రశ్నించారు.
రాష్ట్రంలో రాజకీయాలను వ్యాపారం చేసింది బాబేనన్నారు. ఎన్నికల సంఘం వద్ద 400 దొంగ ఆఫిడవిట్లను దాఖలు చేసిన చరిత్ర టీడీపీదేనని పేర్కొన్నారు. ‘టీడీపీ' అంటే తోడు దొంగల పార్టీ అని దుయ్యబట్టారు. తెలంగాణ టీడీపీ నేతలు భవిష్యత్లోనూ చంద్రబాబునే నమ్ముకుంటే వారి బతుకు బస్టాండేనని హితవు పలికారు. ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందర్నీ వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజమని ఆరోపించారు. బయ్యారం గనుల విషయంలో టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు రెండు కళ్ల సిద్ధాంతాన్నే పాటిస్తున్నారని విమర్శించారు.