తెలంగాణ ఎఫెక్ట్!: సిడబ్ల్యుసి నుండి కావూరి ఔట్
తెలంగాణ కారణంగానేనా..?
కావూరి సాంబశివ రావు దశాబ్దాలుగా కాంగ్రెసు పార్టీలో ఉంటున్నారు. ఆయన ఎప్పటి నుండో కేంద్రమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రతి మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆయన పేరు వినిపించింది. అయితే ఆయనకు అవకాశం మాత్రం దక్కలేదు. దీంతో అలకచెందిన ఆయన గతేడాది పార్లమెంటు సభ్యత్వానికి, కాంగ్రెసులోని ఇతర పదవులకు రాజీనామా చేశారు. ఆయన అసంతృప్తిని గుర్తించిన అధిష్టానం ఆయనను బుజ్జగించింది. ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు.
ఇటీవల పునర్వ్వవస్థీకరణలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆయనకు కేబినెట్లో చోటు కల్పించారు. జౌళిశాఖను అప్పగించారు. అంతకుముందు రోజే సిడబ్లుసిలో శాశ్వత ఆహ్వాన సభ్యుడిగా నియమించారు. అయితే ప్రధాన సమస్యగా ఉన్న తెలంగాణపై అధిష్టానం ఇప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెసు పార్టీ నిర్ణయం దాదాపుగా తెలంగాణకు అనుకూలంగానే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ వర్కింగ్ కమిటీలో కావూరి కొనసాగితే ఆయనను సీమాంధ్రలో ప్రశ్నించే అవకాశముంది. కావూరి కరడుగట్టిన సమైక్యవాదిగా ముద్రపడ్డారు. ఇప్పుడు కాంగ్రెసు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటున్న సమయంలో, అదీ తెలంగాణకు అనుకూలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే సమనయంలో సిడబ్ల్యుసిలో ఉంటే తన ప్రాంతంలో తనకు నష్టమని భావించిన కావూరి రాజీనామా చేసి ఉంటారని అంటున్నారు. సిడబ్లుసి మెంబర్గా తెలంగాణపై ఆయన నిర్ణయం పార్టీ పరంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.