బాబాయ్ని కరుణించిన జగన్: కీలక బాధ్యతలు
వైయస్ వివేకానంద రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలని వైయస్ జగన్ నిర్ణయించారు. అనంతపురం జిల్లాలో అనంతపురం లోక్సభ స్థానం పరిధిలోని తాడిపత్రి, కళ్యాణదుర్గంలతో పాటు హిందూపురం లోక్సభ స్థానం పరిధిలోని మడకశిర, కదిరి, పెనుకొండ, హిందూపురం శాసనసభ స్థానాల పరిశీలకుడిగా వైయస్ వివేకానంద రెడ్డిని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరు శాసనసభా నియోజకవర్గాల్లోనూ పార్టీని బలోపేతం చేసే బాధ్యతను వైయస్ వివేకానంద రెడ్డికి జగన్ అప్పగించారు. అయితే, కడప జిల్లా నుంచి వైయస్ వివేకానంద రెడ్డి దూరంగా ఉండాల్సిందేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అనంతపురం జిల్లాలోని ఆ బాధ్యతలను బాబాయ్కి ఏ ఉద్దేశంతో అప్పగించారనేది తెలియడం లేదు.
వైయస్ జగన్ కాంగ్రెసు అధిష్టానంతో విభేదించి బయటకు వచ్చి కొత్త పార్టీని స్థాపించినప్పుడు వైయస్ వివేకానంద రెడ్డి సహకరించలేదు. పైగా, కాంగ్రెసు పార్టీలోనే ఉన్నారు. రాష్ట్ర మంత్రి పదవిని స్వీకరించారు. వదిన వైయస్ విజయమ్మపై పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెసు అధిష్టానం ప్రాధాన్యం తగ్గించడంతో వెనక్కి వచ్చారు.