బైరెడ్డి కొత్త పార్టీ ఆర్పీఎస్, లోగో తిమ్మమ్మ మర్రిమాను
తాను స్థాపించిన పార్టీ పదవుల కోసం కాదని, రాయలసీమ ప్రజల కోసమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సీమ హక్కుల కోసం అందరం కలిసి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనపై ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్ని పార్టీల పైన మండిపడ్డారు.
చంపిన వాడితో పాటు చంపించిన వాడిది కూడా తప్పేనని, ఆ మాటకొస్తే చంపించిన వాడిదే ఎక్కువ తప్పని అలాగే విభజన విషయంలో అనుకూలంగా చెప్పిన పార్టీలదే తప్పన్నారు. అలా చెప్పిన వారు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలే కావడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
ఇంటి దొంగను తరిమేందుకే పార్టీ స్థాపించినట్లు చెప్పారు. విశాఖ ఉక్కు కోసం సీమవాళ్లు కూడా త్యాగం చేశారని అయినా, ఉద్యోగాల్లో మనకు మొండిచేయి చూపిస్తున్నారని ఆరోపించారు. సీమకు సంబంధం లేని నందికొండ ప్రాజెక్టు కోసం మన ప్రాంతం కూడా ఉద్యమించిందన్నారు.
కృష్ణా జలాలు సీమకు రాకుండా అనేకసార్లు అడ్డుకున్నారన్నారు. విభజన వల్ల నష్టపోయేది సర్కారు జిల్లాలైతే ఉద్యమించేది మనమా అని ప్రశ్నించారు. సీమకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోందన్నారు. సీమ హక్కుల కోసం తాను ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నానన్నారు. రాష్ట్రాన్ని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తాను ఏడాదిగా మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు.