ఐదేళ్లకే డాక్టరేట్ సాధించిన తెలుగు బాల మేధావి
న్యూఢిల్లీ: ఐదేళ్లు కూడా నిండని ఆ బాల మేధావిని డాక్టరేట్ వరించింది. 20-30ఏళ్లు కష్టపడితే గానీ చేతికందని డాక్టరేట్ను ఆ బాలుడు ఐదేళ్లకే సాధించాడు. ఆ బాల మేధావి ఎవరో కాదు తెలుగు తేజం ధీరజ్. తెలుగు దంపతులు కళ్యాణ్, వీణల కుమారుడే ఈ ధీరజ్.
అసాధారణ తెలివితేటలతో మూడు సార్లు గిన్నిస్ రికార్డ్ కైవసం చేసుకున్న ఆ బాల మేధావికి ఢిల్లీలోని వరల్డ్ రికార్డు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. సోమవారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో వర్సిటీ అధికారులు సదరు డాక్టరేట్ను ధీరజ్కు ప్రదానం చేయనున్నారు.
చెన్నైలో తన తల్లిదండ్రులతో ఉంటున్న ధీరజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. రెండేళ్ల వయస్సులో 2 నిమిషాల 19 సెకన్లలోనే 215 జాతీయ పతాకాలను గుర్తుపట్టిన ధీరజ్, మూడున్నరేళ్ల వయసులో 83 మంది శాస్త్రవేత్తల పేర్లను వారి ఆవిష్కరణలు సహా ఒకే ఒక్క నిమిషంలో చెప్పేశాడు.
వరల్డ్ మ్యాప్ పజిల్ను 3నిమిషాల 20సెకన్లలో పూర్తి చేసిన ధీరజ్ నిజంగా గౌరవ డాక్టరేట్కు అర్హుడే. కాగా, తమ కుమారుడు చిన్న వయసులోనే డాక్టరేట్ సాధించడం పట్ల అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంత చిన్న వయసులో డాక్టరేట్ సాధించి అరుదైన రికార్డు నెలకొల్పుతున్నాడని వారు చెప్పారు. ప్రస్తుతం ధీరజ్ యుకేజి చదువుతున్నాడు.