మొదటికే మోసం: చంద్రబాబు దెబ్బకు బిజెపి చిత్తు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి దెబ్బకు సీమాంధ్రలో బిజెపి చిత్తు అయ్యేట్లు కనిపిస్తోంది. వివిధ నియోజకవర్గాలపైనే కాకుండా బిజెపి అభ్యర్థుల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ కొర్రీలు వేస్తూ వస్తోంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఇక రెండు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు బిజెపితో పొత్తు విషయంలో కొర్రీలు పెడుతున్నారు. ఆర్ఎస్ఎస్ మితిమీరిన జోక్యంతో పొత్తుపై వెనక్కి తగ్గాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా తీసికట్టు నాగంబొట్లు అన్నట్లుంది. దాంతో బిజెపికి తెలంగాణలో దాదాపుగా అడిగినన్ని సీట్లకు కాస్తా తక్కువగా ఇచ్చి చంద్రబాబు సర్దుకున్నారు. కానీ, సీమాంధ్రలో తమ బలం అధికంగా ఉందనే ఉద్దేశంతో బిజెపిని మొత్తం తన ఆధిపత్యంలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. ఎట్టకేలకు నాలుగు ఎంపీ సీట్లు, 14 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. బిజెపి కూడా దాంతో సంతృప్తి చెందింది.
అయితే, అసలు కథ ఆ తర్వాతే ప్రారంభమైంది. మొదటి నుంచీ తన వదిన దగ్గుబాటి పురంధేశ్వరి విషయంలో చంద్రబాబు అడ్డుపడుతూ వచ్చారు. ఆమెకు సీటు దక్కకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన వ్యవహరించారని అంటున్నారు. విశాఖపట్నం సీటు ఆమెకు ఇవ్వవద్దంటూ అక్కడి తెలుగుదేశం నాయకులు గొడవ చేశారు. నిజానికి, పురంధేశ్వరి ఆ సీటును కోరుకున్నారు. చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి బిజెపి విశాఖ సీటును హరిబాబుకు బిజెపి కేటాయించింది. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వైయస్ విజయమ్మ పోటీకి దిగారు.
పురంధేశ్వరికి సీటు రాకపోవడంతో విశాఖ లోకసభ నియోజకవర్గంలో వైయస్ విజయమ్మ విజయం నల్లేరు మీద నడకేనని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆ విషయంపైనే తెలుగుదేశం పార్టీ గొడవ చేస్తోంది. బలహీనమైన అభ్యర్థి బిజెపి పోటీకి దించడంతో వైయస్ విజయమ్మకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విశాఖ సీటును కేటాయించిందని, చేజేతులా విశాఖ సీటును రాజకీయ ప్రత్యర్థులకు అప్పజెబుతోందని తెలుగుదేశం నాయకులు గొడవ చేస్తున్నారు.
అదే విధంగా నర్సాపురం సీటు విషయంలో తెలుగుదేశం పార్టీ గొడవ ప్రారంభించింది. రఘురామ కృష్ణంరాజుకు కాకుండా గోకరాజు రంగరాజుకు బిజెపి టికెట్ ఇవ్వడంపై వివాదం సృష్టించింది. దీంతో రఘురామకృష్ణంరాజు కూడా నామినేషన్ దాఖలు చేశారు. పురంధేశ్వరికి రాజంపేట టికెట్ ఇస్తే కూడా చంద్రబాబు అభ్యంతరం తెలియజేస్తున్నారు. దీంతో సీమాంధ్రలో మోడీపై ఉన్న సానుకూల వైఖరి కూడా బిజెపికి పనికిరాకుండా చేయడంలో చంద్రబాబు విజయం సాధించారని అంటున్నారు.
బిజెపి ఒంటరిగా పోటీ చేస్తే తెలంగాణలో తమ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందనే భయం, సీమాంధ్రలో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తే తమ ఓట్లు చీలుతుయానే అనుమానం చంద్రబాబును పొత్తుకు పురికొల్పినట్లు చెబుతున్నారు. అయితే, సీట్ల సర్దుబాటును సరిగా అమలు చేయడంలో చంద్రబాబు వ్యూహం ప్రకారం వ్యవహరించారని అంటున్నారు.
దానికితోడు, అసెంబ్లీ సీట్ల విషయంలోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు కిరికిరి ప్రారంభించారు. బిజెపికి కేటాయించిన ఇచ్చాపురం తదితర అసెంబ్లీ స్థానాలపై గొడవ ప్రారంభించారు. బిజెపికి మదనపల్లిలో టిడిపి అభ్యర్థి నామినేషన్ వేశారు. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు విషయంలో వ్యవహరించి ఎన్నికల్లో ఓటమి చవి చూసిన విధంగానే చంద్రబాబు ఇప్పుడు బిజెపితో వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది.