వాట్సప్ ద్వారా అక్కాచెల్లెళ్లకు అసభ్య మెసేజ్లు: అరెస్ట్
హైదరాబాద్: ఓ యువతికి అసభ్య, బెదిరింపు సందేశాలు పంపడంతోపాటు ఆమె సోదరికి కూడా వాట్సప్ ద్వారా అసభ్య సందేశాలు, చిత్రాలు పంపిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడ్ని విచారిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. కె కిరణ్(33) నగరంలోని బోడుప్పల్లోని అశోక్నగర్లో నివాసం ఉంటున్నాడు. డిసెంబరులో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కిరణ్కు మరో యువతి పరిచయమైంది. భార్య, పిల్లలను వదిలి వచ్చి పెళ్లి చేసుకుంటానని ఆ యువతికి తెలిపాడు.
అంగీకరించని ఆమె కిరణ్ను దూరం పెట్టింది. దీంతో అతడు ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆ యువతి ప్రవర్తన మంచి కాదంటూ మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తూ ఆమె సోదరికి వాట్సప్ ద్వారా అసభ్యకర చిత్రాలు పంపించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
మరో ఘటనలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ ఘరానా దొంగను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా విపనగండ్ల మండలం నాగర్లబండ తండాకు చెందిన శంకర్ నాయక్(23) ఇప్పటి వరకు జిల్లాలో 30 దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత షాద్ నగర్, కొత్తూరు, శంషాబాద్లలో తాళం వేసివున్న ఇళ్లల్లో 14 చోరీలకు పాల్పడ్డాడు. కాగా, నిఘా పెట్టిన పోలీసులు అతడ్ని శుక్రవారం అరెస్ట్ చేసి, రూ. 8.25 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.