పాస్పోర్ట్ చించేస్తానని కూతురుపై తండ్రి లైంగిక దాడి
హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. మాయమాటలు చెప్పి ఓ ఎన్నారై మహిళను పెళ్లి చేసుకున్న ఓ కామాంధుడు, ఆమె కూతురు అన్న విషయం కూడా మరచి ఆమె(14)పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం నగరంలోని రామంతపూర్లో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రవివర్మ(45) హైదరాబాద్లోని రామంతపూర్లో భార్యాపిల్లలతో ఉంటున్నాడు. గతంలో ఓ పత్రికలో క్రైమ్ రిపోర్టర్గా పని చేస్తున్న సమయంలో విశాఖపట్నానికి చెందిన ఉమామహేశ్వరితో పరిచయం ఏర్పడింది. రూ. 500 కోట్లు వచ్చే ప్రాజెక్టు తనకు రాబోతుందని, ముందస్తు పెట్టుబడి కావాలని ఆమెను అడిగాడు.
ఈ విషయాన్ని ఉమామహేశ్వరి స్నేహితురాలు అమెరికాలో ఉండే ఓ మహిళకు చెప్పింది. ఆమెకు భర్తతో విడాకులై కూతురు, కుమారుడితో అమెరికాలో నివసిస్తున్నారు. ప్రాజెక్టు విషయం నమ్మిన ఆమె నెట్ ద్వారా రూ. 50వేల అమెరికన్ డాలర్లు(సుమారు రూ. 23లక్షలు) పంపించింది. వీరి పరిచయం పెరిగి ప్రేమగా మారడంతో 2013లో తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో ఆమె, రవివర్మ వివాహం చేసుకున్నారు.
కొంతకాలం రాజమండ్రిలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నారు. తర్వాత ఆమె తన సోదరీలైన నాగదేవి, స్నేహదేవీల వద్ద సికింద్రాబాద్లో తన కుమార్తెను కొన్నాళ్లు ఉంచింది. కాగా, రవివర్మ వారి ఇళ్లకు తరచూ వెళ్లి ఆమె కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. అంతేగాక ఆమెను పాస్ పోర్ట్ చించేస్తానని బెదరింపులకు గురిచేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు కుటుంబసభ్యులకు తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితుడు రవివర్మను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లో డెంటిస్టు ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్బీ ప్రగతీనగర్లో డెంటిస్టు ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ జిల్లా మల్యాలకు చెందిన ప్రవల్లికకు నెల్లూరు జిల్లాకు చెందిన నిరంజన్తో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. అయితే దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రవల్లిక ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.