అనుమానం: భార్య గొంతు కోసిన భర్త, అత్తపై దాడి
కృష్ణా: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ ప్రబుద్ధుడు గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. కృష్ణా జిల్లాలోని బందరు మండలం కరగ్రహారం గ్రామంలో ఈ దారుణం జరిగింది. జొన్నలవారిమోడి గ్రామానికి చెందిన బొల్లా నాగేశ్వరరావు, కరగ్రహారం గ్రామానికి చెందిన భూలక్ష్మికి పదిహేనేళ్ల క్రితం వివాహమైంది.
కొన్ని నెలలుగా వీరు కరగ్రహారం గ్రామంలో నివశిస్తున్నారు. పెళ్ళయిన నాటి నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉండటం, భూలక్ష్మిపై నాగేశ్వరరావుకు అనుమానం ఉండటంతో వేధిస్తుండేవాడు.
ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో నాగేశ్వరరావు కొబ్బరికాయలు నరికే కత్తితో భూలక్ష్మి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అత్తపై దాడి చేసిన వ్యక్తిపై కేసు
లెనిన్ సెంటర్కు చెందిన బెరిజెల లూర్దుమేరి(64) తమ కుమార్తెను రాజు అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేసింది. భార్యాభర్తల మధ్య వచ్చిన వివాదం నేపథ్యంలో రాజు లూర్దుమేరిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు సెప్టెంబర్ 13న అత్తపై దాడి చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.