దారుణం: ఆస్తి కోసం కన్న కూతుర్నే నరికి చంపింది
హైదరాబాద్: ఆస్తి కోసం తన కన్న కూతుర్నే కత్తి నరికి హత్య చేసింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన నగరంలోని యూసుఫ్గూడ లక్ష్మీనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే కళ్యాణి(25)ను ఆమె కన్నతల్లి లక్ష్మి(50) కత్తితో నరికి చంపడమే కాక.. శవం పక్కనే కత్తి పట్టుకుని నిలబడింది.
దీంతో ఆమెను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మికి ముగ్గురు కుమార్తెలు. అంతా కలిసి లక్ష్మీనగర్లో నివాసం ఉంటున్నారు. తల్లీ కూతుళ్ల మధ్య కొంత కాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూతుళ్లతో కలిసి మరో కుమార్తె కళ్యాణిని తుదముట్టించిందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇంటిచుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సిసిటీవీ కెమెరాలు అన్నింటినీ ధ్వంసం చేసి.. ఆ తర్వాత హత్యకు పాల్పిడినట్లు పోలీసులు తెలిపారు.
కళ్యాణిని హత్య చేసిన తల్లి లక్ష్మితోపాటు ఆమె మరో ఇద్దరు కూతుళ్లను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.