గన్నవరం: నూజివీడుపై బాబు దృష్టి, తిరుపతికీ సమస్యే
గన్నవరం విమానాశ్రయ విస్తరణకు అదనంగా 490 ఎకరాలు అవసరం. అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించాలంటే ఈ రన్వేను 7600 అడుగుల నుంచి 10500 అడుగులకు విస్తరించాలి. కేసరపల్లి, అప్పారావుపేట, అజ్జంపూడి, బుద్ధవరం తదితర గ్రామాల్లో 490 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే 160 కోట్ల రూపాయలను కేటాయించింది. అయినప్పటికీ గన్నవరం విమానాశ్రయం పరిస్ధితి ఎక్కడ వేసిన గొంగళి అనే చందంలా తయారయిందట.
దీంతో చంద్రబాబు ఆదేశంమేరకు బాపులపాడు లేదా నూజివీడు వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆగస్టు 31లోగా భూసేకరణ సమస్య తేలకపోతే సెప్టెంబర్ రెండోవారంలో గన్నవరం సమీపంలోనే బాపులపాడు లేదా నూజివీడు వద్ద వివాదంలేని ప్రభుత్వ భూమిని సేకరించి యుద్ధప్రాతిపదికన ముందుకెళ్లాలనే యోచనతో ప్రభుత్వం ఉందట.
ఇక, తిరుపతి విమానాశ్రయానికి అనేక ఇక్కట్లు ఎదురవుతున్నాయి. తిరుపతికి అదనంగా 402 ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఈ భూములను గుత్తివారిపల్లి, కురకాల్వ, జింకలమిట్ట తదితర గ్రామాల నుంచి సేకరించాల్సి ఉంది. తిరుపతి, గన్నవరంలలో భూముల విలువ పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం స్వీకరించేందుకు ఇక్కడి రైతులు సిద్ధంగా లేరట. దీంతో విమానాశ్రయాలకు అంతర్జాతీయ విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా కల్పించడం సులభం కాదంటున్నారు. దశాబ్దకాలంగా గన్నవరం విమానాశ్రయానికి భూసేకరణ సమస్యగా ఉంది.