తెరాసలో చేరతానని ఫోన్ చేయలేదా?: ఎర్రబెల్లికి కడియం
హైదరాబాద్: వరంగల్ జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి కడియం శ్రీహరిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోమవారం జరిగిన సమావేశంలో ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
ఎరువులు పక్కదారి పడుతున్నాయన్న అంశంపై పరస్పరం విమర్శించుకున్నారు. టిఆర్ఎస్ పార్టీలో చేరతానని తనకు ఫోన్ చేయలేదా? అని కడియం శ్రీహరి.. ఎర్రబెల్లిని ప్రశ్నించారు. ఇక్కడ రాజకీయాలకు అవకాశం లేదని ఎర్రబెల్లి.. కడియంకు సూచించారు.
కాగా, ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ను ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎర్రబెల్లి తాను టిడిపిలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు.
కాగా, ఈ నేపథ్యంలో ఎర్రబెల్లితో వాగ్వాదానికి దిగడం, పార్టీలో చేరతానని ఎర్రబెల్లి తనకు ఫోన్ చేశారని కడియం చెప్పడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇది ఇలా ఉండగా మరికొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సిఎం కెసిఆర్ను తరచూ కలుస్తుండటం గమనార్హం.