కేసీఆర్తో అమెరికా కంపెనీ, జగన్ ఎమ్మెల్యే తాటి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో అమెరికా బేలర్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణలో హార్ట్ ఇనిస్టిట్యూట్ను స్థాపించేందుకు వారు ముందుకు వచ్చారు. రూ.600 కోట్లతో ఇనిస్టిట్యూట్ను పెడతామని, వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తామని వారు కేసీఆర్కు చెప్పారు.
కేసీఆర్ను కలిసిన జగన్ పార్టీ ఎమ్మెల్యే తాటి
ఖమ్మం జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మంగళవారం కేసీఆర్ను కలిశారు. ఇటీవల రివ్యూ మీటింగులో తన పైన మాగంటి బాబు దాడి చేశారని, దీని పైన న్యాయవిచారణ జరిపించాలని ఆయన కేసీఆర్ను కోరారు. కాగా, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గవర్నర్ నరసింహన్ను కలిశారు.
రుణమాఫీపై డీకే అరుణ, కిషన్ రెడ్డి
కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మొత్తం రుణాలను మాఫీ చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ వేరుగా అన్నారు. మొత్తం రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలన్నారు. తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్యక్రమాల పైన ప్రతిపక్షాల అభిప్రాయం తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ ఆలస్యం కారణంగా పలువురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల వాయిదాకు యత్నించడం శోచనీయమన్నారు.
హైదరాబాద్ సమస్యలపై సీఎం కేసీఆర్తో చర్చించిన అసదుద్దీన్
మజ్లిస్ నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. హైదరాబాదు నగరంలో నెలకొన్న సమస్యలైపై సీఎంతో చర్చించారు. స్పందించిన కేసీఆర్, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాదును ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
రైతులకు రుణాలివ్వాలి: పోచారం
బ్యాంకర్లతో తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. రైతులకు రుణాలు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు. అనంతరం మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. బ్యాంకర్లకు రేపటి నుండి నిధులు చెల్లిస్తామని పోచారం తెలిపారు. బ్యాంకులు తక్షణమే రైతులకు కొత్త రుణాలివ్వాలని సూచించారు. రైతులకు అరవై శాతం మేర రుణాలివ్వాలని, ఎవరికైనా సమస్యలు ఉంటే గ్రీవెన్ సెల్లో చెప్పాలని తెలిపారు. బ్యాంకర్ల సూచనలను రైతులు పాటించాలన్నారు.