ఆనం బ్రదర్స్ బాధ్యత లోకేష్కు, సోమిరెడ్డిలో గుబులు
హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెసు పార్టీకి చెందిన ఆనం సోదరులు ( ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి) తెలుగుదేశం పార్టీలో చేరవచ్చుననే ప్రచారం జరుగుతోంది.
వెంకయ్యనాయుడు సూచనతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనసు మార్చుకున్నారని, దీంతో ఆనం సోదరులను టీడీపీలోకి తీసుకు వచ్చే బాధ్యతను నారా లోకేష్ పైన పెట్టారని అంటున్నారు.
ఇదిలా ఉండగా, ఆనం సోదరుల రాక మాజీ మంత్రి, జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలో గుబులు పుట్టిస్తోందట. టీడీపీలో ఆయన ఇప్పుడు జిల్లాలో అగ్రనేత. వారి రాకతో తన ప్రాధాన్యత కొంతైనా పడిపోతుందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వారి రాకను వ్యతిరేకిస్తున్నారట.
ఆనం సోదరులు
మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డిలకు టీడీపీలో బెర్త్ ఖాయమయినట్టే కనిపిస్తోందని అంటున్నారు. ఆనం వివేకా నాలుగు రోజుల క్రితం టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుతో భేటీ కూడా అయ్యారు. అనంతరం వీరిద్దరి బాధ్యతనూ యువనేత లోకేశ్కు అప్పజెప్పారట చంద్రబాబు.
నారా లోకేష్
ఈ క్రమంలో ఆనం సోదరులతో నారా లోకేశ్ ఫోనులో మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 24న చంద్రబాబు నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ లోగానే ఆనం సోదరుల వ్యవహారాన్ని తేల్చే పనిలో లోకేశ్ ఉన్నారట.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఆనం సోదరులు టీడీపీలో చేరితే జిల్లా పార్టీలో వారి ఆధిపత్యం పెరిగిపోతుందని జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారట. మరో మంత్రి నారాయణ మాత్రం వీరి రాకను వ్యతిరేకించడం లేదంటున్నారు.
చంద్రబాబు నాయుడు
ఆనం సోదరుల చేరిక పైన సోమిరెడ్డి అభ్యంతరం చెబుతున్న కారణంగానే.. చాలా రోజులపాటు చంద్రబాబు ఆ సోదరులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటున్నారు.
వెంకయ్య నాయుడు
అయితే, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి సూచనతో చంద్రబాబు మనసు మార్చుకున్నారట. సోమిరెడ్డిని బుజ్జగించి, ఆనం సోదరులను టీడీపీలోకి రప్పించే బాధ్యతను లోకేష్ చూస్తున్నారట.