మెట్రో రైలుపై ఆంధ్ర కుట్ర: కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు వివాదం ఢిల్లీకి చేరుకుంది. ప్రాజెక్టు నుంచి తప్పుకుంటామని ఎల్ అండ్ టి సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన అంశాన్ని సోమవారం ప్రధాని కేబినెట్ సెక్రటరీ అజయ్ సేథ్ దృష్టికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ప్రభుత్వ సలహాదారు పాపారావు తీసుకెళ్లారు. ప్రధాని కేబినెట్ సెక్రటరీకి చేసిన ఫిర్యాదు ప్రతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సోమవారం మీడియాకు విడుదల చేసింది.
ఎల్ అండ్ టి సంస్థ లేఖ రాయడం వెనుక ఆంధ్ర లాబాయింగ్ హస్తం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బ తీయడానికి ఎల్ అండ్ టి సంస్థ ప్రయత్నిస్తోందని రాజీవ్శర్మ, పాపారావు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. వాస్తవానికి మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ఇప్పటికే అన్ని మైలురాళ్లను దాటుకుంటూ వచ్చిందంటే అది తమ ప్రభుత్వం చూపిన చొరవ వల్లే సాధ్యమైందని వారు ఫిర్యాదులో అన్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై ఉద్దేశ పూర్వకంగానే ఎల్ అండ్ టి దుష్ప్రచారం చేస్తోందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు సంబంధించి ఎలాంటి జటిల సమస్యా తమవద్ద పెండింగ్లో లేదని స్పష్టం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని లేఖలో అన్నారు.
ఇదిలావుండగా, హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోపాయికారిగా హైదరాబాద్ ప్రాజెక్టును వదిలిపెడితే ఆంధ్రలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టులు అప్పగిస్తామని ఒప్పందం చేసుకున్నట్టు వారు ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టి సంస్థ వదులుకున్నా ఇబ్బంది లేదని, ప్రాజెక్టును చేపట్టేందుకు పెద్ద కంపెనీలు అనేకం సంసిద్ధత వ్యక్తం చేస్తూ తమను సంప్రదించినట్టు ప్రభుత్వ సలహాదారు పాపారావు స్పష్టం చేసినట్టు తెలిసింది.