బాబు ప్లాన్: బెజవాడ భూముల ధరల పెంపు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నిర్ణయం కాగానే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏ విధమైన ప్రమేయం లేకుండానే భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇదే సమయంలో అదనపు రెవెన్యూను రాబట్టుకోవడానికి భూముల బుక్ వాల్యూ పెంచాలని భావిస్తోంది.
భూమల ధరలు పెంచే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే ఆ విషయంపై ప్రభుత్వం తీవ్రంగానే ఆలోచిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి చెప్పారు. మార్కెట్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడలోనూ దాని పరిసరాల్లోనూ భూముల ధరలను పెంచాలని తాము ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ధరల పెంపుదల విజయవాడకు, దాని పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితమని, ఇతర ప్రాంతాలకు ధరలు పెంచబోమని ఆయన బుధవారం మీడియాతో అన్నారు. ధరలకు రెక్కలు వచ్చిన నేపథ్యంలో దాన్ని అదుపు చేయడానికంటూ విజయవాడ ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్పై ఏ విధమైన నిషేధం పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.
కొత్త రాజధాని కోసం విజయవాడలోనూ దాని పరిసరాల్లోనూ అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భూములను పరిశీలిస్తున్నట్లు కెఈ చెప్పారు. కొత్త రాజధాని కోసం ఏ విధంగా భూమిని సేకరించాలనే విషయంపై ప్రజాభిప్రాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. భూసేకరణపై కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కొంత స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు.
రాజధాని కోసం భూసేకరణ ప్రక్రియను అధ్యయనం చేయడానికి వేసిన మంత్రి వర్గం ఉప సంఘం ఉండకూడదనేది తన నిర్ణయమేనని, తనను పక్కకు పెట్టినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. తాను ఎందుకు కమిటీలో ఉండదలుచుకోలేదో అందరికీ తెలుసునని కెఈ కృష్ణమూర్తి చెప్పారు.