అమెరికాలో ఎపి వైద్యురాలి ఆత్మహత్య: టెక్కీ భర్తకు అపైర్?
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన 42 ఏళ్ల హోమియోపతి వైద్యురాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు భరించలేకనే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అర్థవీడు మండలానికి చెందిన దోనపతి పద్మశ్రీ కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న గిద్దలూరుకు చెందిన డి. నందకిశోర్ రెడ్డిని 1999లో వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలో పద్మశ్రీ కుటుంబ సభ్యులు కట్నం కింద పది లక్షల రూపాయలు ఇచ్చారు. మరింత కట్నం కోసం నందకిశోర్ రెడ్డి పద్మశ్రీని వేధిస్తూ వచ్చాడని కుటుంబ సభ్యులు అంటున్నారు.
నందకిశోర్ రెడ్డికి వివాహేతర సంబంధం ఉందని, విడాకులు ఇవ్వాలని పద్మశ్రీపై ఒత్తిడి తెస్తున్నాడని పద్మశ్రీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పద్మశ్రీ కాలిఫోర్నియాలో జనవరి 10వ తేదీన అనుమానాస్పద స్థితిలో మరణించగా, సోమవారంనాడు గిద్దలూరుకు చేరుకుంది.
భర్త వేధింపులు భరించలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పద్మశ్రీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నందకిశోర్పై పద్మశ్రీ తల్లి, సోదరుడు కాలిఫోర్నియా పోలీసులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. పద్మశ్రీ మృతికి నందకిశోర్ రెడ్డి కారణమని వారు ఆరోపించారు.