కెసిఆర్ కుట్ర, మాయలో పడొద్దు: రావెల కిశోర్ ఫైర్
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్, స్థానికత అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అనుసరిస్తున్న వైఖరిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎంసెట్ కౌన్సెలింగ్ను వాయిదా వేయడానికి కెసిఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేసుకుని, జోక్యం చేసుకోవాలని కోరడానికి రేపు ఆంధ్రప్రదేశ్ అఖిలపక్ష ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు.
కెసిఆర్ మాయ చేస్తున్నారని, కెసిఆర్ మాయలో పడకూదడని, మన విద్యార్థులను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. స్థానికత, ఫీజు రీయింబర్స్మెంట్పై తాము కేంద్ర జోక్యాన్ని కోరడం లేదని, పేరా 95ని అమలు చేయడానికి జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరుతామని ఆయన చెప్పారు.
ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్పై చర్చ అప్రస్తుతమని ఆయన అన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్లు ముందు ప్రారంభం కావాల్సి ఉందని ఆయన అన్నారు. అడ్మిషన్లు ప్రారంభమైతే స్థానికత వివాదం ముందుకు వస్తుందని, అప్పుడు చూసుకోవచ్చునని ఆయన అన్నారు.
ఉమ్మడి అడ్మిషన్లు జరగాలన్నప్పుడు అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తాము కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి రావెల కిషోర్ బాబు అంతకు ముందు అన్నారు. తాము అఖిలపక్ష బృందంతో బుధవారం ఢిల్లీ వెళ్తామన్నారు. హోంమంత్రి, మానవవనరుల శాఖ మంత్రి తదితరులను కలుస్తామని చెప్పారు. అవసరమైతే ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు.