ఆంధ్రోళ్లే బిచ్చమెత్తుకుంటారు, తెలంగాణ కాదు: ఈటెల
కరీంనగర్: బిచ్చమెత్తకునేది ఆంధ్రోళ్లే తప్ప తెలంగాణ సమాజం కాదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఏర్పడితే ఏ అనుభవం పరిపాలిస్తారని, బిచ్చమెత్తుకోవాల్సి వస్తుందని కొందరు చులకనగా మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.
తమకు మందిని ముంచే అనుభవం లేదని, అక్రమాలను చెరబట్టి, బ్రోకర్లను జైళ్లలో పెట్టే అనుభవం మాత్రం ఉందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజకీయ అవినీతిని పూర్తిగా అంతం చేసి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెప్పారు.
బీడి కార్మికులు, గల్ఫ్ బాధితులు, రైతుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ఎన్నికల ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గల్ఫ్ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్లో ఆయన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు గల్ఫ్ బాథితులు ఆయన కలిసి తమను ఆదుకోవాలని కోరారు. తాము గల్ఫ్ దేశాలను సందర్శించి బాధితుల కష్టాలను స్వయంగా చూసినట్లు తెలిపారు. రూ.500 కోట్లతో కేరళ మాదిరిగా గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన 43 అంశాల్లో గల్ఫ్ బాధితుల అంశం కూడా ఉందని ఆయన చెప్పారు.