ఏపీ అసెంబ్లీ ద్వారం పగులగొట్టారు, మతిస్థిమితం లేకనే..
హైదరాబాద్: హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ద్వారాన్ని ఓ వ్యక్తి పగులగొట్టాడు. దీంతో అసెంబ్లీలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఆంధ్రప్రదేశ అసెంబ్లీ ఆరో గేటు వద్ద ద్వారాన్ని కొంతమంది దుండగులు బద్దలుకొట్టారు. దీన్ని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఏసీపీ కమలాసన్రెడ్డి ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ద్వారాన్ని బద్దలు కొట్టిన దుండగుల్లో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
కాగా, శాసన సభ ప్రవేశ ద్వారాన్ని పగులగొట్టింది మతిస్థిమితం లేని వ్యక్తి అని, అతను వరంగల్ జిల్లా పస్రాకు చెందిన అశోక్ రెడ్డి అని దక్షిణ మండల డీసీపీ కమలాసన్ రెడ్డి మధ్యాహ్నం చెప్పారు. నిందితుడు గేట్ నంబర్ 1 నుండి లోపలకు వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా గుర్తించామన్నారు. అతను బంజారాహిల్స్లో నివసిస్తున్నారన్నారు. కొంతకాలంగా అశోక్ రెడ్డి మానసిక పరిస్థితి బాగా లేదన్నారు. అశోక్ రెడ్డి పైన కేసు నమోదు చేశామని, భద్రతా లోపాల పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా అసెంబ్లీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రేమించలేదని కత్తితో పొడిచాడు
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదన్న కారణంతో తోటి విద్యార్థినిని సాయి అనే విద్యార్థి కత్తితో పొడిచాడు. అటు తను కూడా పొడుచుకున్నాడు. వెంటనే ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.
రెండు వర్గాల మధ్య ఘర్షణ
మహబూబ్ నగర్ జిల్లాలోని గట్టు మండలం మాచర్లలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వ భూముల విషయంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.