కేసిఆర్ ఫ్యాన్ని కానీ: డొక్కా హెచ్చరిక, ఇరుకున పెట్టారు
హైదరాబాద్/గుంటూరు: మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీనియర్ కాంగ్రెసు పార్టీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో చెడ్డపేరు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. తాను కేసీఆర్ అభిమానిని అని, ఆయన అంటే రోజు రోజుకు గౌరవం పెరుగుతోందన్నారు.
దళితులకు మూడెకరాల భమి, మైనార్టీలకు రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలు మంచి ఆలోచన అని కితాబిచ్చారు. ఈ విషయాల పైన మంచిపేరు తెచ్చుకుంటన్న కేసీఆర్ స్థానికత పైన కన్ఫూజన్లో ఉన్నారన్నారు.
ఫీజురీయింబర్స్మెంట్స్ అంశానికి సంబంధించి స్థానికతను 1956కు అనడం గందరగోళానికి దారి తీస్తుందన్నారు. ఫీజు రీయంబర్సుమెంట్స్ పైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చించుకోవాలని హితవు పలికారు. గవర్నర్ జోక్యం చేసుకొని దీనిని పరిష్కరించాలన్నారు.
కాగా, కేసీఆర్ పథకాలను మెచ్చుకోవడం ద్వారా డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేతలను ఇరుకున పెట్టారని అంటున్నారు. కాంగ్రెసు పార్టీ తెరాస ప్రభుత్వానికి ప్రతిపక్షం. ఈ నేపథ్యంలో డొక్కా కేసీఆర్ను మెచ్చుకోవడం, అంతేకాకుండా.. తెలంగాణ కాంగ్రెస్ కూడా వ్యతిరేకించి ఫీజు రీయింబర్స్మెంట్స్ ఒక్క దాని పైనే ఆయన విమర్శించడం గమనార్హం.