అవును.. గజదొంగను వదిలేశారు: ఏపీ డిప్యూటీ సీఎం
హైదరాబాద్: పోలీసులు గజదొంగను వదిలేశారని, అది నిజమేనని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప శుక్రవారం అన్నారు. దొంగను పట్టుకొని తీసుకు రావాలని ఆదేశించినట్లు చెప్పారు. విచారణ అనంతరం సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా పెదపూడి పోలీసు స్టేషన్లో గజదొంగ నుండి రూ.లక్ష తీసుకొని పోలీసులే అతడిని బయటకు తప్పించినట్లుగా వార్తలు వచ్చాయి. దీని పైన ఏపీ హోం మంత్రి స్పందించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న గజదొంగ పారిపోయాడని... కాదు కాదు పోలీసులే లంచం తీసుకుని వదిలేశారని మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన చినరాజప్ప... పై విధంగా స్పందించారు.
దొంగనోట్ల ముఠా అరెస్టు
కృష్ణా జిల్లా కలిదిండిలో దొంగనోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. దొంగనోట్లను చెలామణి చేస్తున్న ముఠా నాయకుడు వెంకన్న సహా నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4.5 లక్షల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఈ ముఠా దొంగనోట్లను తెచ్చి ఇక్కడ చెలామణి చేస్తోంది. ఈ ముఠా గత ఎన్నికల్లోనూ దొంగనోట్లను సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో కేసును పోలీసులు సీఐడీకి అప్పగించారు.