పారిపోను: బాధ్యత తనదేనన్న బాబు, కోపం తగ్గిందని
అనంతపురం: ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రజలను వదిలి పారిపోయే రకం కాదని, మళ్లీ ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తనదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు అన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లాలో కదిరిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. ప్రజల దయవల్లే తాను 9ఏళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశానని చెప్పారు. అత్యధిక కాలం ఉమ్మడి రాష్ట్రానికి సిఎం పని చేసిన అవకాశం తనకు మాత్రమే దక్కిందని అన్నారు.
పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడ్డారని, ఆర్థికంగా చితికిపోయారని చంద్రబాబు ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర విభజనతో తమకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు కాలగర్భంలో కలిపేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమ కోపాన్ని చూపించారని.. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు దక్కకుండా చేశారని అన్నారు. 125ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారని అన్నారు. ఇప్పుడు వారి కోపం చల్లారిందని తెలిపారు.
రాష్ట్ర ప్రజల మేలు కోసమే నాలుగు శ్వేత పత్రాలు విడుదల చేశాననన్నారు. రైతుల, డ్వాక్రా సమస్యలను తెలుసుకుని.. వారి కళ్లల్లో ఆనందం చూడాలనే రుణమాఫీ ప్రకటించానని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున రుణ మాఫీ దేశంలో ఎక్కడా చేయలేదని అన్నారు. నిజమైన రైతులకు తాము చేస్తున్న రూ. 1.50లక్షల రుణమాఫీ ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. పేదలకు న్యాయం జరగాలనే తమ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టామన్నారు.
ప్రతి డ్వాక్రా సంఘానికి రూ. లక్ష రుణ మాఫీ చేస్తున్నామని.. ఇది మొత్తంగా రూ. 8వేల కోట్లుగా ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వద్దన్నా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రుణాల మాఫీ చేయించామని చెప్పారు. రైతులకు మేలు చేసేలా తాము రుణాలు మాఫీ చేస్తున్నా.. వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
నేనూ రైతు బిడ్డనేనని చంద్రబాబు అన్నారు.రైతుల కళ్లలో ఆనందం చూసేందుకే రుణమాఫీ చేశానని చెప్పారు. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లా అనంతపురం అని అన్నారు. అనంతపురం జిల్లాను బాగుచేసే వరకు విశ్రమించనన్నారు.
అనంతపురం రైతులు పండ్ల తోటలు వేస్తే అధిక లాభం పొందవచ్చని, ప్రతి రైతు ఒక శాస్త్రవేత్త కావాలన్నారు. పండ్ల తోటలకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో ఉన్నదని బాబు చెప్పారు. విభజన తీరు అభ్యంతరకరమన్నారు. భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఎంత ఖర్చైనా హంద్రీనీవా పూర్తి చేస్తామన్నారు.