రభస చేసినా సుసాధ్యం, ఏపీకి జగన్ వద్దు!: పుల్లారావు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వంటి ప్రతిపక్ష నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం లేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళవారం అన్నారు. రైతు రుణాలు మాఫీ చేయడం అసాధ్యమని ప్రతిపక్షాలు నానా రభస చేశాయని అయితే, దానిని తాము సుసాధ్యం చేసి చూపామన్నారు.
రాష్ట్ర బడ్జెట్ రూ.16 వేల కోట్ల లోటుతో ఉన్నప్పటికీ తాము రుణ మాఫీ చేయబోతున్నామన్నారు. బంగారంపై కూడా రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. మన దేశంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదన్నారు. ఈ సమావేశంలో మరో మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.
కడప, వరంగల్లలో విమానాశ్రయాలు: అశోక్
దేశవ్యాప్తంగా 50 చవక విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. తిరుపతి, విశాఖ విమానాశ్రయాలను ఆధునికీకరిస్తామన్నారు.
విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళతామన్నారు. కొత్తగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కడప, వరంగల్లలో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ వివరాలను ఆయన మంగళవారం లోకసభలో తెలిపారు.