అపార్ట్మెంట్లలా.. రాజధానిపై చంద్రబాబు కొత్త ప్లాన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి బిల్డర్ ఫార్ములాను అమలు చేయాలన్న యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఓ వైపు భారీ ఎత్తున భూములను సేకరించి, వాటిని ఆదాయవనరుగా మార్చుకోవడంతోపాటు మిగిలిన భూముల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతి(పీపీపీ)లో నిర్మాణాలను చేపట్టి రాజధానికి రూపకల్పన చేయాలని భావిస్తోంది.
ఈ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి అమలు చేసేందుకు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే సేవలను వినియోగించుకోవాలని సర్కార్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించడానికి నాలుగు లక్షల కోట్ల రూపాయలు కావాలని రాజధానిపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా నివేదించింది.
చంద్రబాబు కూడా రాజధాని నిర్మాణానికి తొలుత కనీసం లక్ష కోట్లు అవసరమని వెల్లడించారు. ఆ స్థాయిలో కేంద్రం సహకారం కోరారు. కానీ కేంద్రం ఇంత వరకు స్పందించలేదు. దీంతో, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇప్పట్లో పూర్తవుతుందా అనే సందేహాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై పెద్దగా ఖర్చు లేకుండా రాజధానిని నిర్మించడానికి చంద్రబాబు వ్యూహరచన చేశారు.
అందులో భాగంగా రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమి కంటే రెండింతలు ఎక్కువ భూములను ప్రభుత్వం సమీకరించనుంది. దాదాపు లక్ష ఎకరాలను సమీకరించాలనే ధ్యేయంతో ముందుకు వెళుతోంది. అన్ని భూములు లభించిన చోటే రాజధానిని నిర్మించాలని కూడా భావిస్తోంది. వీటిలో కొన్ని భూములను విక్రయించడం, మరికొన్ని భూముల్లో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడం ప్రభుత్వ వ్యూహంగా తెలుస్తోంది.
రాజధాని నిర్మాణానికి చంద్రబాబు అనుసరించనున్న ఫార్ములా కొత్తది కాదనే వాదనలు వినిపిస్తున్నాయంటున్నారు. అయితే, దానిని రాజధాని నిర్మాణానికి ఉపయోగించడం దేశంలోనే ఇదే తొలిసారి అంటున్నారు. ఇందుకు అపార్టుమెంటు నిర్మాణాన్ని ఉదాహరణగా చూపుతున్నాయి.
ఒక అపార్టుమెంటును నిర్మించినప్పుడు.. భూమి ఒకరిది. దానిని బిల్డర్ తీసుకుని అందులో అపార్టుమెంట్ నిర్మిస్తాడు. భూ యజమానికి కొన్ని ఫ్లాట్లను ఇస్తాడు. బిల్డర్ కొన్ని ఫ్లాట్లను తీసుకుంటాడు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలోనూ అచ్చు ఇటువంటి ఫార్ములానే అమలు చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.