ఎంసెట్ రద్దుకు ఎపి ప్రభుత్వ యోచన: గంటా వెల్లడి
హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం నిర్వహిస్తున్న ఎంసెట్ను రద్దు చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారంనాడు వెల్లడించారు. తమిళనాడు తరహాలో మెడికల్, ఇంజనీరింగ్ అడ్మిషన్లను నిర్వహించనుంది. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఈ రెండు కోర్సుల్లో అడ్మిషన్లు ఇస్తారు.
ఎంసెట్ను రద్దు చేసి, తమిళనాడు తరహాలో అడ్మిషన్లను నిర్వహించడానికి ఉండే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఓ కమిటీని వేయనుంది. సోమవారంనాడు ఈ కమిటీ తమిళనాడు సందర్శిస్తుంది. ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ ఇస్తూ ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్మిషన్లు కల్పించారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్థానికత అంశాలను ముందుకు తెచ్చింది. దీంతో ఎంసెట్ కౌన్సెలింగ్లో జాప్యం జరుగుతూ వస్తోంది. దీంతో ఎంసెట్ను రద్దు చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎంసెట్ అడ్మిషన్లను తెలంగాణ ప్రభుత్వమే క్లిష్టతరం చేసిందని గంటా శ్రీనివాస రావు అన్నారు. ఎంసెట్తో సంబంధం లేకుండా ప్రవేశాలు కల్పించే అంశం గురించి ఆలోచన చేస్తున్నామని ఆయన చెప్పారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గంటా చెప్పారు.