పోలవరం: ముంపు మండలాలు గోదావరి జిల్లాలకు, జీవో
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ విభజన చట్టం సవరణ మేరకు ఉమ్మడి రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్న మండలాలను ఆయా జిల్లాల్లో కలుపుతున్నట్లు ఏపీ రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వు జారీ చేశారు.
ఒక ప్రాంతానికి చెందిన మండలాలు, గ్రామాలను మరో జిల్లాలో లేదా రాష్ట్రంలో కలపాల్సి వస్తే 1984 జిల్లాల ఏర్పాటు ఉత్తర్వుల మేరకు ప్రజాభిప్రాయం తీసుకోవాలి. ఈ మేరకు ఖమ్మం జిల్లాలోని మండలాలు, గ్రామాలను తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కలపడం పట్ల ప్రజాభిప్రాయ సేకరణకు ఆ రెండు జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆంధ్రాలో కలిసే మండలాలు, గ్రామాల ప్రజలనుంచే ఈ అభిప్రాయాలు స్వీకరించాలని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ విడుదల చేశాకనెల రోజుల వ్యవధిలో ఆ మండలాల ప్రజలు తమ అభిప్రాయాలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో లిఖితపూర్వకంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా ఏపీ భూ పరిపాలనా ముఖ్య కమిషనర్(సీసీఎల్ఏ)కు పంపించాల్సి ఉంటుంది.
భద్రాచలం గ్రామాన్ని మినహాయించి, మిగిలిన మండలాన్ని రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో కలిపారు. ఈ మండలానికి నెల్లిపాక కేంద్రంగా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో... కుకునూరు, వేలేరుపాడు మండలాలను జంగారెడ్డి గూడెం రెవెన్యూ డివిజన్లో కలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో... భద్రాచలం గ్రామం మినహాయించి భద్రాచలం మండలాన్ని రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని నెల్లిపాకలో మండలంలో కలిపారు. నెల్లిపాకే మండల కేంద్రంగా ఉంటుంది. కోనవరం, చింతూరు, వర రామచంద్రాపురం రెవెన్యూ మండలాలను రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో కలిపారు.